తన చిన్నారికి గోరుముద్దలు తినిపించి ఆలనాపాలన చూడాల్సిన తల్లి కనీసం లేచి కూర్చోలేని పరిస్థితి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి నిర్లక్ష్య వైఖరి. పదిహేను రోజులుగా సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉంటున్నా పట్టించుకోని సిబ్బంది నిర్వాకం. వెరసి మూడేళ్ల చిన్నారితో సహా ఆమె తల్లి నరకయాతన అనుభవించారు. అనారోగ్యం బారిన పడగా సరైన చికిత్స అందక ఎముకల గూడుగా మారుతున్న తల్లి చెంతనే ఉంటూ ఆకలి బాధను భరిస్తూ వచ్చింది చిన్నారి అంకిత. సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ తల్లి ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించింది. ఆకలికి తాళలేక ఆ పాప ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయేది. చివరకు చైతన్య యువజన సంఘం సభ్యులు చొరవ చూపడంతో తల్లీకూతుళ్లను ఆస్పత్రిలో చేర్చుకొని చికిత్స మొదలుపెట్టారు.
ఉపాధి వెతుక్కుంటూ..
బాధితురాలు చెప్పిన ప్రకారం వివరాలు.. మెదక్ జిల్లా టేక్మాల్కి చెందిన రమేష్, రజితలు ఉపాధి వెతుక్కుంటూ పటాన్చెరు మండల పరిధి చిట్కుల్కి వచ్చారు. ఆమెకు మూడు నెలలుగా ఆరోగ్యం సరిగా లేదు. ఈ క్రమంలో రమేష్ తన భార్య, కూతురిని తీసుకొని పదిహేను రోజుల క్రితం సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చారు. కొన్ని వైద్య పరీక్షలూ చేశారు. అయితే రమేష్ కూడా సరిగా పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది తమకెందుకొచ్చిందన్నట్లు ఆమెకు చికిత్స చేయలేదు. కనీసం ఆకలి తీరుద్దామని కూడా ఆలోచించలేదు. అలా కొద్ది రోజులుగా తల్లీకూతుళ్లులిద్దరూ వానకు తడుస్తూ.. ఆకలికి ఓర్చుకుంటూ జీవన పోరాటం సాగిస్తూ వచ్చారు.
ముందుకొచ్చి
ఈ విషయం సంగారెడ్డి పట్టణానికి చెందిన చైతన్య యువజన సంఘం ప్రతినిధులకు తెలిసింది. వినోద్కుమార్, రవిశంకర్, చందు, ప్రవీణ్లు వెంటనే ఆస్పత్రికి వచ్చి వారి దయనీయ స్థితిని గమనించారు. వీడియో తీసి దానిని పాలనాధికారి హనుమంతరావుకు వాట్సాప్ చేశారు. దీంతో సాయంత్రం సమయంలో జిల్లా కేంద్ర ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ సంగారెడ్డి అక్కడికి వచ్చారు. యువకులతో మాట్లాడుతూనే సిబ్బందిని పిలిపించారు. తల్లీబిడ్డకు అవసరమైన చికిత్స అందిస్తామని స్పష్టం చేశారు. వెంటనే ఆస్పత్రిలో చేర్చుకున్నారు. రజితకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు మూడేళ్ల చిన్నారి అంకితకు అన్ని విధాలుగా అండగా నిలిచేలా ఉన్నతాధికారులు మరింత చొరవ తీసుకోవాలని ఆ యువకులు కోరారు. తామూ చేతనైనంత సాయం చేస్తామని వివరించారు. వీడియో చూసి స్పందించిన జిల్లా పాలనాధికారి హనుమంతరావుకూ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఉంటూ వైద్య సహాయం కోసం 15 రోజులుగా అల్లాడుతున్నా పట్టించుకోని సిబ్బంది తీరు చర్చనీయాంశంగా మారింది.