తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐకేపీ అధికారులు నడుం బిగించారు. ఆసరా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల చేత ఇంటి ఆవరణలో రెండేసి మొక్కలు నాటించడం ద్వారా హరితశోభ సంతరించుకునేలా కృషి చేయాలని నిర్ణయించారు. నర్సరీల నుంచి తీసుకువెళ్లిన మొక్కలను నాటడంతోనే సరిపెట్టకుండా, వాటిని సంరక్షించే చర్యలు చేపట్టాలని ఈ ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆసరా పింఛన్లు పొందుతున్న వారంతా, ఒక్కొక్కరు రెండేసి మొక్కలు నాటాలని సూచించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,02,967 మంది లబ్ధిదారులన్నారని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీతారామారావు తెలిపారు.
పింఛను తీసుకోండి...మొక్కను నాటండి... - medak
చెట్లను పెంచటం ద్వారా కలిగే ప్రయోజనాల పట్ల ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) అధికారులు. పింఛను పొందుతున్న లబ్ధిదారుల చేత మొక్కులు నాటిస్తూ, హరితహారానికి ఊతం అందిస్తున్నారు.

ఉన్నత అధికారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఐకేపీ అధికారులు పింఛను దారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొక్కలు చెట్లయితే కలిగే ప్రయోజనాన్ని వివరిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లోని పింఛనుదారులు ముందుకు వస్తున్నారు. మొక్కలు నాటి, వాటి ఆలనాపాలనా చూడటంం ద్వారా అవి ఏపుగా పెరిగి భవిష్యత్తు తరాలకు ఆహ్లాదం పంచుతాయని.. పర్యావరణ సమతుల్యానికి దోహద పడుతాయని వివరిస్తున్నారు. పశువులు ధ్వంసం చేయకుండా కంచెను ఏర్పాటు చేసుకోవాలని చైతన్య పరుస్తున్నారు. ఇది విజయవంతమైతే ఇక ఇంటింటా పచ్చని కళ కనువిందు చేయనుంది.