కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని హుజూరాబాద్, కొత్తపల్లి, ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లతో పాటు హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయం పచ్చదనానికి చిహ్నాలుగా మారాయి. సీపీ కమలాసన్రెడ్డి సూచనల మేరకు ఠాణాల్లో మొక్కల పెంపకానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఏసీపీ కార్యాలయ ఆవరణలో చేపల చెరువును ఏర్పాటు చేశారు.
పూలు.. పండ్లు సహా..
కూరగాయలు, పూలు, పండ్ల మెుక్కలు పెంచుతున్నారు. వంకాయ, టమాట, బెండకాయ, బీరకాయ, దోసకాయ, మిర్చి, ఉల్లి వంటివి సాగు చేస్తున్నారు. జామ, దానిమ్మ, అంజీరా, రేగు, సీతాఫలం, మామిడి వంటి పండ్ల మొక్కలను పెంచుతున్నారు. పోలీస్ స్టేషన్లలో మెుక్కలు పెంచి పచ్చదనానికి పాటుపడుతున్నారు.
హోంగార్డులకు బాధ్యతలు..
సీపీ కమలాసన్రెడ్డి సూచనలతో చిట్టడవుల పెంపకాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు. మొక్కలకు నీళ్లందించటం, చేపలకు ఆహారం వేయటానికి ప్రత్యేకంగా ఒక హోంగార్డును కేటాయిస్తున్నారు. మొక్కల మధ్య గడపడం ఎంతో ఉల్లాసంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్న సిబ్బంది... వాటిని సంరక్షణతో మానసికంగానే కాకుండా శారీరకంగానూ లాభం చేకూరుతుందని పోలీసులు చెబుతున్నారు.