తెలంగాణ

telangana

By

Published : Dec 20, 2020, 9:26 AM IST

ETV Bharat / state

పచ్చదనానికి చిహ్నాలు.. ఈ ఠాణాలు

పోలీసు ఠాణాలు నందన వనాలుగా మారుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడుతూనే... పోలీసులు ప్రకృతి ప్రేమికులుగా మారుతున్నారు. సీపీ కమలాసన్‌‌రెడ్డి సూచనలతో హుజూరాబాద్ స్టేషన్‌లో అన్నిరకాల మెుక్కలను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

KARIMNAGAR CP ON GREENERY
పచ్చదనానికి చిహ్నాలు.. ఈ ఠాణాలు

పచ్చదనానికి చిహ్నాలు.. ఈ ఠాణాలు

కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలోని హుజూరాబాద్‌, కొత్తపల్లి, ఎల్​ఎండీ పోలీస్‌ స్టేషన్లతో పాటు హుజూరాబాద్‌ ఏసీపీ కార్యాలయం పచ్చదనానికి చిహ్నాలుగా మారాయి. సీపీ కమలాసన్‌రెడ్డి సూచనల మేరకు ఠాణాల్లో మొక్కల పెంపకానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఏసీపీ కార్యాలయ ఆవరణలో చేపల చెరువును ఏర్పాటు చేశారు.

పూలు.. పండ్లు సహా..

కూరగాయలు, పూలు, పండ్ల మెుక్కలు పెంచుతున్నారు. వంకాయ, టమాట, బెండకాయ, బీరకాయ, దోసకాయ, మిర్చి, ఉల్లి వంటివి సాగు చేస్తున్నారు. జామ, దానిమ్మ, అంజీరా‌, రేగు, సీతాఫలం, మామిడి వంటి పండ్ల మొక్కలను పెంచుతున్నారు. పోలీస్‌‌ స్టేషన్‌లలో మెుక్కలు పెంచి పచ్చదనానికి పాటుపడుతున్నారు.

హోంగార్డులకు బాధ్యతలు..

సీపీ కమలాసన్‌రెడ్డి సూచనలతో చిట్టడవుల పెంపకాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు. మొక్కలకు నీళ్లందించటం, చేపలకు ఆహారం వేయటానికి ప్రత్యేకంగా ఒక హోంగార్డును కేటాయిస్తున్నారు. మొక్కల మధ్య గడపడం ఎంతో ఉల్లాసంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్న సిబ్బంది... వాటిని సంరక్షణతో మానసికంగానే కాకుండా శారీరకంగానూ లాభం చేకూరుతుందని పోలీసులు చెబుతున్నారు.

ఆహ్లాదం..

పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పెంచిన మెుక్కలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని కార్యాలయానికి వచ్చిన వారు అంటున్నారు. విధుల్లోనే కాకుండా మెుక్కలు పెంచడంలోనూ పోలీసులు ఎంతో కృషిచేస్తున్నారని కొనియాడుతున్నారు.

ఉచితంగానే..

హరితహారంలో భాగంగా పెంచిన మెుక్కలతో పోలీస్‌స్టేషన్‌ ఆవరణ పచ్చదనంతో కళకళలాడుతోంది. సిబ్బందితో పాటు కార్యాలయానికి వచ్చిన వారికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఇక్కడ పండిన కూరగాయలు, పండ్లను సిబ్బందితో పాటు కక్షిదారులు ఉచితంగా తీసుకెళ్తున్నారు.

ఇవీచూడండి:సెలవుల హుషారు- విహారానికి 'చలి'లో.. చలో

ABOUT THE AUTHOR

...view details