తెలంగాణ

telangana

By

Published : Sep 14, 2021, 9:13 AM IST

ETV Bharat / state

SITHA RAMA PROJECT DPR:ఆ ప్రాజెక్టు వల్ల పోలవరానికి నీటి లభ్యత తగ్గదు: తెలంగాణ

సీతారామ ఎత్తిపోతల మొదటి దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు(Godavari River management Board) , కేంద్ర జలసంఘానికి (Central Water Board) కొన్ని మార్పులతో తాజాగా తెలంగాణ (TELANGANA) అందజేసింది. గోదావరిపై దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి నీటిని మళ్లించేలా 70 టీఎంసీల వినియోగంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని తెలిపింది. కొత్త ఆయకట్టు, స్థిరీకరణకు కలిపి 6.74 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేసే దీని అంచనా వ్యయం రూ.13,057.98 కోట్లుగా పేర్కొంది.

sitha rama project
sitha rama project

సీతారామ ఎత్తిపోతల డీపీఆర్​ను (sitharama project dpr) గోదావరి బోర్డుకు, కేంద్ర జలసంఘానికి తెలంగాణ అందజేసింది. పోలవరానికి (POLAVARAM PROJECT) నీటి లభ్యత తగ్గదని స్పష్టం చేసింది. తాజా డీపీఆర్​పై అభ్యంతరాలుంటే 30తేదీలోగా తెలపాలని పేర్కొంది. గోదావరి నుంచి కృష్ణాలోకి ఈ ప్రాజెక్టు ద్వారా మళ్లించే నీరు గతంలో పేర్కొన్నట్లుగా 20 టీఎంసీలు కాదని, 7.26 టీఎంసీలేనని తెలిపింది. ఈ ఎత్తిపోతల వల్ల పోలవరం ప్రాజెక్టుకు నీటి లభ్యత తగ్గుతుందని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొనడం అపోహ మాత్రమేనని, పోలవరానికున్న కేటాయింపులకు మించి నీటి లభ్యత ఉందని తెలంగాణ పేర్కొంది. 2018లో కేంద్ర జలసంఘానికి సమర్పించిన డీపీఆర్‌లో మార్పులతో పాటు ఎలక్ట్రో మెకానికల్‌ పనులు, నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం అడిగిన సందేహాలకు సమాధానాలతో సహా అన్ని అంశాలను గోదావరి నదీ యాజమాన్యబోర్డుకు అందజేసింది. తాజా డీపీఆర్‌పై అభ్యంతరాలేమైనా ఉంటే 30వ తేదీలోగా తెలపాలని.. లేదంటే ఆమోదించినట్లుగా భావించాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కృష్ణా నదీ యాజమాన్యబోర్డుకు గోదావరి బోర్డు తెలిపింది.ఈ మేరకు గోదావరి యాజమాన్య మండలి సభ్యులు పి.ఎస్‌.కుటియాల్‌ లేఖ పంపారు.

ఆంధ్రప్రదేశ్‌ది అనుమానం మాత్రమే

సీతారామ ఎత్తిపోతల వల్ల పోలవరం ప్రాజెక్టుకు నీటి సమస్య తలెత్తుతుందని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొనడం అనుమానం మాత్రమేనని తెలంగాణ స్పష్టం చేసింది.

* 2018 అక్టోబరు 30న కేంద్ర జలసంఘం హైడ్రాలజీ డైరెక్టరేట్‌ అభిప్రాయం ప్రకారం సీతారామ ఎత్తిపోతల వద్ద 332.87 టీఎంసీలు, పోలవరం వద్ద 571 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని తెలిపింది. శబరిలో ఒడిశా వాటాను 75 శాతం నీటిలభ్యత ప్రకారం 112.8 టీఎంసీలకు బదులు కేంద్ర జలసంఘం పేర్కొన్నట్లు 159 టీఎంసీలను పరిగణనలోకి తీసుకొన్నా పోలవరం వద్ద 525 టీఎంసీలు ఉంటుంది. కేంద్రజలసంఘం 95వ సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన దాని ప్రకారం ఇక్కడ అవసరం 449.78 టీఎంసీలు మాత్రమేనని తెలిపింది.

* గోదావరిలో 75 శాతం నీటి లభ్యత కింద అందుబాటులో ఉన్న 1,486.155 టీఎంసీల్లో 2014 జనవరి2న అప్పటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ రాసిన లేఖ ప్రకారం ఏపీకి 518.215 టీఎంసీలు, తెలంగాణకు 967.94 టీఎంసీలు అని పేర్కొంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ 776 టీఎంసీలు ఉన్నాయంటుందని, ఇది వాస్తవం కాదని.. ఇందుకు సంబంధించిన వివరాలను బోర్డుకు తెలంగాణ తెలిపింది.

* సీతారామ ఎత్తిపోతల ద్వారా కృష్ణాబేసిన్‌లోకి మళ్లించేది 7.26 టీఎంసీలు మాత్రమేనంది. గతంలో 20 టీఎంసీలు ఉండగా.. దీనిని సవరించి తగ్గించామంది. ఇది కూడా కృష్ణాబేసిన్‌లో నీటి లభ్యత బాగా తక్కువగా ఉన్న సంవత్సరాల్లో మాత్రమే వినియోగిస్తామని, గ్యాప్‌ ఆయకట్టుకోసమేనని వివరించింది.

* 1971 ఏప్రిల్‌ 19న కృష్ణా,గోదావరి బేసిన్ల పరిధిలోని రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం గోదావరి ట్రైబ్యునల్‌ కేటాయించిన నీటిని ఇతర బేసిన్లకు మళ్లించి వినియోగించుకొనే స్వేచ్ఛ ఉందని, ట్రైబ్యునల్‌ తుది తీర్పులో కూడా దీన్ని చేర్చారని తెలిపింది. బచావత్‌ ట్రైబ్యునల్‌లోని క్లాజ్‌ 14-బి మిగులు జలాలు మళ్లించడానికి సంబంధించినది తప్ప రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల నుంచి మళ్లిస్తే వర్తించదని వివరించింది.

* పోలవరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ 1978 ఆగస్టు4న చేసుకొన్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాలోని ప్రకాశం బ్యారేజికి మళ్లించే 80 టీఎంసీలను నాగార్జునసాగర్‌ ఎగువన వినియోగించుకోవాలి. 80 టీఎంసీల కంటే ఎక్కువ మళ్లించినా ఆ మేరకు సాగర్‌ నుంచి దిగువకు నీటిని తగ్గించి ఎగువన ఉన్న మూడు రాష్ట్రాలు పంపిణీ చేసుకోవాల్సి ఉందన్నారు. కాబట్టి పోలవరం ద్వారా మళ్లించే నీటికి ఉన్న నిబంధన సీతారామ ఎత్తిపోతలకు వర్తించదని తెలంగాణ పేర్కొంది.

ఇదీ చూడండి:KRMB: వాడివేడిగా కృష్ణాబోర్డు భేటీ.. తెలంగాణకు 34%, ఏపీకి 66% నీటి వాటాలు

ABOUT THE AUTHOR

...view details