American Consulate Building Inauguration In Hyderabad : భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్ఠం కావాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. హైదరాబాద్ నానక్రాంగూడలో ఏర్పాటుచేసిన నూతన అమెరికన్ కాన్సులేట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తమిళిసై.. ఇరు దేశాలు శాంతి భద్రతలపై మరింత కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. తెలుగు భాషను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష అని అమెరికన్ రాయబారి ఎరిక్ గార్సెట్టి చెప్పడం.. చాలా సంతోషకరమైన విషయమని ఆమె వివరించారు. అమెరికాలో విద్యాభ్యాసం కోసం నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో రోజురోజుకీ పెరుగుతోందని తెలిపారు. హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరుదేశాల సత్సంబంధాల సమావేశం టీహబ్లో జరిగింది.
"అమెరికా 247వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నా శుభాకాంక్షలు. నా దృష్టిలో ఇది కాన్సులేట్ కార్యాలయం కాదు.. సహృదయం నిండిన నిలయం. తెలుగు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషనని రాయబారి చెప్పారు. తెలంగాణకు సోదరిగా నేను సంతోషపడుతున్నా. అమెరికాలో విద్యాభ్యాసం కోసం నమోదు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది చాలా సంతోషకరం. నా జీవితంలో ఈ రోజు చరిత్రాత్మకమైనది. మన ఇరు దేశాల స్నేహం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను." - తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
US Consulate In Hyderabad : అలాగే అమెరికన్ రాయబారి మాట్లాడుతూ.. 340 మిలియన్ డాలర్లతో ఏర్పాటుచేసిన నూతన కాన్సులేట్ భవనం భారత్- అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అమెరికాకు ఇండియా అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్ అని భారత యూఎస్ అంబాసిడర్ అన్నారు. భారత్ అమెరికా దేశాల మద్య ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలతో ఇప్పటి వరకు 191 బిలియన్ డాలర్స్ ట్రేడ్ అయిందని వివరించారు. ఇది ఇతర దేశాలతో పోల్చితే అత్యధికమన్నారు. స్టార్టప్ ఎకో సిస్టంలో తెలంగాణ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు.