Government School Children Problems: రాష్ట్రంలో ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం పేద పిల్లల చదువుకు శాపంగా మారింది. సకాలంలో పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించాల్సిన విద్యాశాఖ చివరివరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా బడులు తెరిచి నెల దాటినా ఇప్పటికీ సగం మందికి పుస్తకాలు అందలేదు. తగినంతమంది ఉపాధ్యాయులు, పాఠ్యపుస్తకాలు లేకుండా సర్కారు బడుల్లో పిల్లలు.. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో ఎలా పోటీపడగలరని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, ‘మన ఊరు-మన బడి’తో కార్పొరేట్ స్థాయి వసతులు అంటూ ఊరించిన విద్యాశాఖ అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలేదు. ఈసారి ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు.. భారీ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అవకాశం ఉందని చెప్పిన ఆ శాఖ కనీస చర్యలు చేపట్టకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.
సార్లు లేరు.. పుస్తకాలూ ఆలస్యం
విద్యాశాఖ గణాంకాల ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 19 వేల ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. ఈ విద్యా సంవత్సరం కొత్త ఉపాధ్యాయులు రావడం అనుమానమే. కనీసం విద్యా వాలంటీర్లనైనా నియమించడం లేదు. గతంలో 12,600 మంది వాలంటీర్లు పనిచేసేవారు. రాష్ట్రంలో 31.24 లక్షల మంది విద్యార్థులకు 1.70 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం. ఈ నెల 22వ తేదీ వరకు 80 శాతం పుస్తకాలను జిల్లా కేంద్రాలకు పంపారు. వాటిని మండల కేంద్రాలకు, అక్కడి నుంచి బడులకు పంపేసరికి మరో 20 రోజులకు పైగా పడుతుందని అంచనా. గత ఏడాది ఏకరూప దుస్తులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు అసెంబ్లీకి నివేదించిన విద్యాశాఖ ఈసారి కూడా వాటిని సకాలంలో అందించలేకపోతోంది. పాఠశాలలు తెరిచి నెల దాటినా నిర్వహణ నిధులూ మంజూరు చేయలేదు.
రాదారే బడి!
ఆదిలాబాద్ గ్రామీణ మండలం మామిడిగూడ పంచాయతీలోని పెద్ద సల్పలగూడ గిరిజన విద్యార్థుల బడి కష్టాలివి. పదేళ్ల కిందట పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరైనా గుత్తేదారు మధ్యలోనే పనులు నిలిపివేశారు. దీంతో రహదారిపైనే విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి. గతంలో పూర్తిస్థాయి ఉపాధ్యాయుడు ఉండేవారు. ప్రస్తుతం తాత్కాలిక ఉపాధ్యాయుడు సీఆర్టీ పాఠాలు చెబుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 640 మంది విద్యార్థులున్నారు. 6-10 తరగతుల విద్యార్థులకు కేవలం 180 సెట్ల పుస్తకాలను అందజేశారు. వీటిలో కూడా అన్ని సబ్జెక్టులవి రాలేదు. ఒక్కో విద్యార్థికి 3 నుంచి 4 పుస్తకాలు మాత్రమే ఇచ్చారు. ఏకరూప దుస్తుల కోసం వచ్చిన వస్త్రాన్ని దర్జీలకు ఇచ్చి 15 రోజులైనా అవీ అందలేదు. జీవశాస్త్రం, తెలుగు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాల్వంచ మండలం నాగారం జడ్పీ ఉన్నత పాఠశాలలో 173 మంది విద్యార్థులుండగా, ఆరో తరగతి ఆంగ్లం, తెలుగు పాఠ్యపుస్తకాలు అందలేదు. ఏడో తరగతి హిందీ, ఇంగ్లిష్, సామాన్యశాస్త్రం పుస్తకాలు మాత్రమే ఇచ్చారు. ఏకరూప దుస్తుల జాడలేదు. ఇక్కడ సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయ పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉండడంతో విద్యార్థులు నష్టపోతున్నారు.