కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబరు-నవంబరు మధ్య టీ20 ప్రపంచకప్ జరగడం దాదాపు అసాధ్యం అనే అభిప్రాయానికి వచ్చేశారంతా! అదే సమయంలో ఐపీఎల్ జరుగుతుందన్న ప్రచారమూ గట్టిగా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విమాన ప్రయాణాలపై ఆంక్షలుండటం, సమీప భవిష్యత్తులో స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు కనిపించకపోవడం వల్ల పొట్టి కప్పును వాయిదా వేయక తప్పని అనివార్యత కనిపించింది. కానీ ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయి.
విమాన ప్రయాణాలపై ఆంక్షలు తగ్గుతున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియాలో స్టేడియాల్లోకి జులై నుంచే ప్రేక్షకుల్ని అనుమతించబోతుండటం విశేషం. దేశంలో కరోనా ఆంక్షలను నెమ్మదిగా సడలిస్తున్న ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్.. క్రీడలకు మరిన్ని మినహాయింపులివ్వాలని నిర్ణయించారు. నాలుగో వంతు సామర్థ్యంతో స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహించుకునేందుకు అనుమతులిచ్చారు. అంటే 40 వేల సామర్థ్యం ఉన్న స్టేడియంలోకి 10 వేల మందిని అనుమతిస్తారన్నమాట.