ముంబయికి చెందిన మాజీ రంజీ క్రికెటర్ రాబిన్ మోరిస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. లోన్ ఏజెంట్ని కిడ్నాప్ చేసిన కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలోని కుర్లా ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి ఓ వ్యక్తిని అపహరించాడట మోరిస్. క్రికెటర్కు ఇవ్వాల్సిన కొంత మొత్తాన్ని చెల్లించకపోవడం వల్లే ఈ కిడ్నాప్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఇదీ జరిగింది...
కొన్నాళ్ల క్రితం బ్యాంక్ నుంచి 7 కోట్ల అప్పు ఇప్పిస్తానని మోరిస్ను... ఓ లోన్ ఏజెంట్ కలిశాడు. ఇందుకోసం 7 లక్షలు కమీషన్ తీసుకున్నాడు. అయితే ఆ లోన్ ఇప్పించడంలో విఫలమైన ఆ ఏజెంట్... తీసుకున్న మొత్తం నుంచి ఐదున్నర లక్షలు మాత్రమే తిరిగి చెల్లించాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా మిగతా డబ్బు ఇవ్వక పోవడం వల్ల... అతడిని తన స్నేహితుల సహాయంతో అపహరించాడు మోరిస్. నవంబర్ 30న ఆ ఏజెంట్ను ఓ ప్రాంతానికి రమ్మని చెప్పి... అక్కడ నుంచి ఎత్తుకెళ్లి రహస్యంగా ఓ గదిలో బంధించారు. ఆ తర్వాత బాధితుని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. డబ్బులు తీసుకురమ్మని డిమాండ్ చేసింది మోరిస్ బృందం. ఈ ఘటనపై ఏజెంట్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించినట్లు సీనియర్ పోలీస్ అధికారి దత్తాత్రేయ శిండే తెలిపారు.
కిడ్నాప్, దుర్భాషలాడటం, దోపిడి, మనుషులను గాయపరచాలనుకోవటం, బెదిరించడం లాంటి కేసుల కింద మోరిస్ బృందాన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. గతేడాది మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ.. ఈ క్రికెటర్ కెమెరా కంటికి చిక్కి వార్తల్లో నిలిచాడు.