తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'విప్లవానికి పునాది ప్రేమ.. అదే 'విరాటపర్వం" - rana movie updates

'నీది నాది ఒకే కథ'తో విద్యా విధానానికి అసలైన అర్థాన్ని చూపించిన దర్శకుడు వేణు ఊడుగుల. ఇప్పుడు మరో వినూత్న కథతో 'విరాటపర్వం' అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రానా, ప్రియమణి, సాయి పల్లవి తదితర నటీనటులెందరో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలను వేణు మాటల్లోనే విందాం.

venu udugula latest movie virata parvam special interview
'విప్లవానికి పునాది ప్రేమ.. అదే 'విరాటపర్వం"

By

Published : Jul 12, 2020, 7:00 AM IST

"వాస్తవ ఘటనలే నా కథా వస్తువులు. నా స్వభావమే నేను చేసే సినిమాల్లో కనిపిస్తుంది" అంటున్నారు యువ దర్శకుడు వేణు ఊడుగుల.'నీది నాది ఒకే కథ'తో ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. ప్రస్తుతం 'విరాటపర్వం' తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాతో సహా లాక్‌డౌన్‌, తదుపరి ప్రాజెక్టులపై పలు విశేషాలు పంచుకున్నారు వేణు.

'నీది నాది ఒకే కథ', 'విరాటపర్వం' రెండూ సామాజిక కోణంలో సాగుతున్నవే? ఇలాంటి కథలకే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.?

మాది వరంగల్‌ జిల్లా. అక్కడ నేను చూసిన మనుషులు, చదివిన పుస్తకాలు, పుట్టి పెరిగిన ఉద్యమ వాతావరణమే నాకో భిన్నమైన దారిని చూపించింది. ప్రేక్షకులకు నేనెలాంటి కథలను చెప్పాలో ఒక స్పష్టమైన అవగాహన ఇచ్చింది. నేను తీసే సినిమాలు ఆ స్పృహతోనే ఉంటాయి. అలా అని లోకాన్ని ఉద్ధరించాలని కాదు. నన్ను నేను అర్థం చేసుకోవడానికే సినిమాలు తీస్తున్నా.

మొదటి సినిమాకు, రెండో సినిమాకు మధ్యలో చాలా విరామం తీసుకున్నట్టున్నారు?

విరాటపర్వం

'విరాటపర్వం' సినిమా చిత్రీకరణ పూర్తవుతుందనుకున్న సమయంలో కరోనా అడ్డంకి వచ్చింది. అంతకు ముందు నటీనటులు అందుబాటులో లేకపోవడం వల్ల నాలుగు నెలల అంతరాయం కలిగింది. ఇది కావాలని తీసుకున్న గ్యాప్‌ కాదు. 10 రోజుల్లో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. ఈ సన్నివేశాల్ని మూడు వందల మందితో తెరకెక్కించాలి. కరోనా విజృంభిస్తున్న వేళ ఇది సాధ్యం కాదు. అందుకే సమయం కోసం ఎదురుచూస్తున్నాం.

'విరాటపర్వం' కథ ఎలా ఉండబోతోంది?

విప్లవం అనేది అమితమైన ప్రేమ నుంచి ఉద్భవిస్తుందని తెలియజెప్పే ఉద్విగ్నభరితమైన కథే 'విరాటపర్వం'. 1990ల్లోని ఒక రాజకీయ సందర్భాన్ని, వ్యక్తిగత సంఘర్షణగా వ్యాఖ్యానించడం జరుగుతోంది. ఇది ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా మనం బాగా ప్రేమించిన వ్యక్తి మరణంలా ఉంటుంది. ఇక సాయిపల్లవిని బెల్లి లలితగా చూపిస్తున్నట్లు నేనెక్కడా చెప్పలేదు. అది కేవలం అపోహే.

మహిళలు కీలక పాత్రలు పోషిస్తున్నారంటా!

అవును. రానా పాత్ర తర్వాత కథలోని కీలకమైన పాత్రలన్నీ మహిళలవే. సాయి పల్లవి, నందితాదాస్‌, ప్రియమణి, జరీనా వహేబ్‌, ఈశ్వరీ రావ్‌లు ఆ పాత్రలకు హుందాతనాన్ని తీసుకొచ్చారు. ఒక రకంగా 'విరాటపర్వం' స్త్రీ తత్వానికి ఒక ట్రిబ్యూట్‌ అని అనుకోవచ్చు. వీళ్లందరితో పాటు నవీన్‌ చంద్ర, సాయిచంద్‌లు మంచి పాత్రలు పోషించారు. రానా అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. నాలాంటి కొత్త దర్శకులను ఆయన బాగా ప్రోత్సహిస్తుంటారు.

విరాటపర్వం

తరువాతది ఎలాంటి సినిమా?

లాక్‌డౌన్‌ సమయాన్ని బాగా వినియోగించుకున్నా. సినిమాలు చూశా. పెయింటింగ్స్‌ వేశా. పుస్తకాలు చదివా. తరువాత సినిమాకు కథ సిద్ధం చేసుకున్నా. 1995లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కించాలనుకుంటున్నా. 14 రీల్స్‌పతాకంపై రామ్‌ ఆచంటా, గోపీ ఆచంటా నిర్మించనున్నారు. పెద్ద హీరోతో ఈ కథను చర్చిస్తున్నాం.

పెద్ద హీరోల కోసం కథలు రాస్తున్నారా?

మనం చెప్పే కథలోని ప్రధాన పాత్రని ఒక అగ్ర కథానాయకుడు పోషిస్తే అది ఎక్కువ మందికి చేరుతుంది. అలాగని పలాన హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాయను. ముందు కథ రాస్తా. అదే పాత్రలను ఎన్నుకుంటుంది.

వెబ్‌ సిరీస్‌ల్లో చేసే ఆలోచన ఉందా?

నిర్మాత అల్లు అరవింద్‌ ప్రోత్సాహంతో 'ఆహా' ఓటీటీ కోసం ఒక ప్రాజెక్టు చేస్తున్నా. దీన్ని చలం రచించిన మైదానం ఆధారంగా రూపొందిస్తున్నా. కానీ దర్శకుడిగా కాకుండా, మొదటిసారిగా నిర్మాతగా పరిచయం అవుతున్నా.

ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అగ్ర కథానాయికలతో మాట్లాడుతున్నాం. ఒక నెలలో పూర్తి వివరాలు తెలుస్తాయి. భవిష్యత్తులో సినిమాలు నిర్మించాలనే ఆలోచన ఉంది.

ఇదీ చూడండి:షారుక్​, ఐష్​ 'దేవదాస్'​కు నేటితో 20 ఏళ్లు

ABOUT THE AUTHOR

...view details