తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాలీవుడ్​కు గ్రాఫిక్స్​ను పరిచయం చేసిన నిర్మాత - shyam prasad reddy news

'మల్లెమాల' సుందరరామిరెడ్డి కుమారుడిగా చిత్రపరిశ్రమకు పరిచయమైన శ్యామ్ ప్రసాద్​రెడ్డి.. కొన్ని విలక్షణ సినిమాల ద్వారా మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరుగాంచాడు. వెండితెర మీదే కాకుండా బుల్లితెరలో కొన్ని కార్యక్రమాలు నడుపుతూ పరిశ్రమలో కొత్త నటీనటులకు అవకాశాలను కల్పిస్తున్నాడు. నేడు శ్యామ్​ ప్రసాద్​రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అతడి జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Tollywood Producer Shayam prasad reddy Birthday special story
టాలీవుడ్​కు గ్రాఫిక్స్​ను పరిచయం చేసిన నిర్మాత

By

Published : Mar 9, 2020, 6:14 AM IST

Updated : Mar 9, 2020, 7:17 AM IST

అతడి పేరు మల్లెమాల సుందరరామిరెడ్డి. కానీ అందరికీ సహజకవి 'మల్లెమాల'గానే సుపరిచితుడు. క్రమశిక్షణకు మారుపేరు. స్వయంగా రైతు కుటుంబం నుంచి సినిమా రంగానికి వచ్చారు. ఆయన జీవితంలో కష్టాలున్నాయి, కన్నీళ్లున్నాయి, పలుగులున్నాయి, పారలున్నాయి, ఎత్తుపల్లాలున్నాయి, నిద్రకు నోచని రాత్రుళ్లున్నాయి. కానీ తన జీవితకాలంలో ఎవరికీ తలవంచలేదు. ముఖ్యంగా చలనచిత్రసీమలో అటువంటి నిర్మాతలుండడం అరుదే. గూడూరులో ఉండే తన సినిమాహాలు సామాగ్రి కోసం 1966లో మద్రాసు వెళ్లిన మల్లెమాల.... కామధేను థియేటర్‌లో 'కుమరిపెణ్ణ్‌' అనే ఒక తమిళ సినిమా చూసి 'కన్నెపిల్ల' పేరుతో ఆ సినిమాను డబ్‌ చేసి విజయం సాధించారు. అమెరికాలో ఉంటున్న తన ఏకైక కుమారుడు శ్యాంప్రసాదరెడ్డిని పిలిపించి, నిర్మాతగా చేసి 'తలంబ్రాలు', 'ఆహుతి', 'అంకుశం', 'ఆగ్రహం', 'అమ్మోరు', 'అంజి', 'అరుంధతి' వంటి సంసారపక్షంగా ఉండే విజయవంతమైన సినిమాలను నిర్మించారు. నేడు (మార్చి 9) శ్యాంప్రసాదరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం...

శ్యాంప్రసాద్‌ తొలిచిత్ర అనుభవం...

మల్లెమాల సుందరరామిరెడ్డికి నాటి కేంద్రమంత్రైన.. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి సన్నిహితులు. మల్లెమాల 'కల్యాణవీణ' చిత్రం నిర్మిస్తున్న సమయంలో విజయభాస్కరరెడ్డి తన కుమార్తెను మల్లెమాల కుమారుడు శ్యాంప్రసాద్‌రెడ్డికి ఇచ్చి పెళ్లి చేద్దామని ప్రతిపాదించారు. అప్పుడు శ్యాంప్రసాద్‌ అమెరికాలో ఉన్నత చదువు చదువుతున్నాడు. శ్యాంప్రసాద్‌ ఆ అమ్మాయిని చూడకుండా తల్లిదండ్రుల మీది గౌరవంతో విజయభాస్కరరెడ్డి చిన్నమ్మాయి వరలక్ష్మిని 1983, నవంబరు 17న హైదరాబాద్​లో పెళ్లాడాడు.

శ్యాంప్రసాద్‌ అమెరికాలో బిజినెస్‌ మేనేజ్​మెంట్‌ కోర్సు చదివి ఉండడం వల్ల మల్లెమాల అతడ్ని ఏదైనా పరిశ్రమ పెట్టమని సలహా ఇచ్చారు. పైగా సినిమా వ్యాపారం ఎప్పుడు ఎవర్ని ఎలా ముంచుతుందో ఊహించలేము. కావున సినిమా నిర్మాణం జోలికి వెళ్ళవద్దని సలహా ఇచ్చారు. కానీ శ్యాంప్రసాద్‌ ఆలోచనా విధానమే వేరు. 'లాభనష్టాలనేవి ప్రతి వ్యాపారంలో ఉండేవే. ప్రేక్షకులకు సరైన వినోదం అందించగలిగితే ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. పైగా కొన్ని వందలమందికి ఉపాధి కలిగించినవాళ్లమవుతాం' అంటూ 'భోజనప్రియులకు రుచికరమైన ఆహారం అందించగలిగితే ఖర్చుకు వెనకాడరు' అనే ఉపమానంతో మల్లెమాలకు నచ్చజెప్పి సినిమా నిర్మాణంవైపే మొగ్గుచూపాడు.

శ్యామ్​ ప్రసాద్​రెడ్డి

అప్పుడు మల్లెమాల... శ్యాంప్రసాద్‌ను అపార వ్యాపారానుభవం గల ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు దగ్గరకు తీసుకెళ్లారు. రామోజీరావు.. శ్యామ్‌తో మాట్లాడి సంతృప్తి చెంది అతనికి చిత్ర నిర్మాణమే సరైన ఉపాధి అని సలహా ఇచ్చారు. అయితే శ్యాంప్రసాద్‌ నిర్మించబోయే తొలి చిత్రాన్ని ఉషాకిరణ్‌ సంస్థ 'మయూరి ఫిలిమ్స్‌' ద్వారానే విడుదల చేయాల్సిందిగా మల్లెమాల కోరారు. అందుకు రామోజీరావు అంగీకరిస్తూ కొంత పెట్టుబడి అడ్వాన్స్‌గా కూడా ఇచ్చారు. అలా శ్యాంప్రసాదరెడ్డి నిర్మాతగా 'తలంబ్రాలు' చిత్రం నిర్మాణానికి సిద్ధమైంది. ఎం.ఎస్‌.ఆర్ట్‌ మూవీస్‌ పతాకం మీద కోడి రామకృష్ణ దర్శకత్వంలో 'తలంబ్రాలు' చిత్రం రూపుదిద్దుకుంది.

రాజశేఖర్, కల్యాణచక్రవర్తి, జీవిత ముఖ్య తారాగణంగా.. సత్యం సంగీత దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం 17-10-1987న విడుదలై ఘనవిజయం సాధించింది. కోడి రామకృష్ణ ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్‌ చేయాలని రాత్రింబవళ్లు శ్రమించి పట్టుదలతో కేవలం 27 రోజుల్లోనే చిత్రనిర్మాణం పూర్తి చేశారు. ముఖ్యంగా రాజశ్రీ రాసిన 'ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు, వేదన శ్రుతిగా రోదన లయగా సాగే గానమిది' అనే పాటను సుశీల ప్రేక్షకులు కంటతడిపెట్టేలా పాడారు. బాలు, సుశీల ఆలపించిన 'నిన్న నీవు నాకెంతో దూరం', 'ఓ దానవుడైన మానవుడా' పాటలు సాహిత్యపరంగా, సంగీత పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మల్లెమాల స్వయంగా రాసిన 'బుల్లిపాప కోరేది తల్లిపాలు, కన్నెపిల్ల కోరేది తలంబ్రాలు' అనే పాటను థీమ్‌ సాంగ్‌గా చిత్రీకరించారు. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు మద్రాసులో జరిపారు. ఈ చిత్రం ద్వారానే రాజశేఖర్‌-జీవిత ఆలుమగలయ్యారు.

తలంబ్రాలు

ఆహుతి చిత్రంతో సుస్థిరం...

కోడి రామకృష్ణ-శ్యాంప్రసాద్‌ రెడ్డి కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో క్రేజ్‌ పెరిగింది. వీరిద్దరి కలయికలోనే రెండవ చిత్రం 'ఆహుతి' శ్రీకారం చుట్టుకుంది. 'ఈ ప్రశ్నకు బదులేది' సినిమా షూటింగ్​లో ప్రతినాయకుడిగా నటించిన అడుసుమిల్లి జనార్దన ప్రసాద్‌ అనే నటుణ్ణి నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి చూశారు.

వెంటనే 'ఆహుతి' చిత్రంలో ప్రసాద్‌కు మంచి పాత్రను ఇచ్చారు. ఈ పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం వల్ల ప్రసాద్‌ 'ఆహుతి ప్రసాద్‌'గా స్థిరపడ్డాడు. 1987,డిసెంబర్‌ 3న ఈ చిత్రం విడుదలై సంచలనం సృష్టించింది. అత్యధిక కేంద్రాల్లో వందరోజులు ఆడింది.

శ్యాంప్రసాద్‌ హ్యాట్రిక్‌ చిత్రం అంకుశం...

వరుసగా రెండు సినిమాలు విజయవంతం కావడం వల్ల ఎం.ఎస్‌. ఆర్ట్‌ మూవీస్‌ సంస్థకు బాధ్యత పెరిగింది. దాంతో హ్యాట్రిక్‌ సాధించే ధ్యేయంతో శ్యాంప్రసాద్‌- కోడి రామకృష్ణ మంచి కథను ఎంపికచేసి 'అంకుశం' పేరుతో నిర్మాణం మొదలుపెట్టారు. ఇందులోనూ రాజశేఖర్‌-జీవితలే నాయకానాయికలు. రామిరెడ్డిని ప్రతినాయకుడిగా తీసుకున్నారు. ఈ సినిమా రాజశేఖర్‌కు పెద్ద బ్రేక్‌ ఇచ్చి స్టార్డమ్​ తెచ్చిపెట్టింది. ఈ సినిమా 1989 జూన్​ 13న విడుదలై కోడి రామకృష్ణ-శ్యాంప్రసాద్‌లకు నిజమైన హ్యాట్రిక్‌ విజయాన్ని అందించింది.

ఈ చిత్రానికి రెండు నంది పురస్కారాలు దక్కాయి. తమ చిత్రాలకు అద్భుత సంగీతాన్ని అందించి సినిమా విడుదలకు ముందు అకాల మరణం చెందిన సంగీత దర్శకుడు సత్యంకు ఈ చిత్రాన్ని అంకితమిచ్చారు. ఎం.ఎస్‌.ఆర్ట్‌ మూవీస్‌ చిత్రాలన్నీ మయూరి ఫిలిమ్స్‌ వారు పంపిణీ చేయడం విశేషం. నాలుగవ చిత్రానికి దర్శకుడిగా కె.ఎస్‌.రవిని తీసుకొని పరుచూరి బ్రదర్స్‌ అందించిన కథతో 'ఆగ్రహం' చిత్రాన్ని శ్యాంప్రసాదరెడ్డి నిర్మించాడు. 1993 జూలై 19న ఈ చిత్రం విడుదలైంది. రాజశేఖర్, అమల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రాజ్‌-కోటి సంగీతం సమకూర్చారు. ఇందులో రాజశేఖర్‌ నటన ఆకట్టుకున్నా సినిమా ఆర్థిక విజయాన్ని సాధించలేకపోయింది.

రికార్డు తిరగేసిన అమ్మోరు...

ఐదవ సినిమాలో సౌందర్య, సురేష్, రమ్యకృష్ణ, రామిరెడ్డిలను ముఖ్య తారాగణంగా తీసుకొని 'అమ్మోరు' చిత్రనిర్మాణాన్ని చేపట్టాడు. తొలుత లఘుబడ్జెట్‌ చిత్రంగా తీయాలని రామారావు అనే కొత్త కుర్రాణ్ణి దర్శకుడిగా తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మల్లెమాల ఈ చిత్రానికి కోడి రామకృష్ణే సరైన దర్శకుడని శ్యాంప్రసాద్‌కు సలహా ఇచ్చి భారీ బడ్జెట్‌తో గ్రాఫిక్‌ మాయాజాలం సృష్టిస్తూ చిత్రాన్ని నిర్మింపజేశారు. 1995 నవంబరు 28న విడుదలైన 'అమ్మోరు' చిత్రం సంచలనాత్మక విజయాన్ని అందించింది.

అమ్మోరు

ఆ తర్వాత 2004లో చిరంజీవి హీరోగా 'అంజి' సినిమా నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అంటే దాదాపు ఎనిమిదేళ్లు శ్యాంప్రసాదరెడ్డి సినిమా తీయలేకపోయాడు. 'అంజి' సినిమా ఒక సోషియో ఫాంటసీ నేపథ్యంలో నిర్మించినదే. ఇందులో నమ్రతా శిరోద్కర్, టినూ ఆనంద్, నాగేంద్రబాబు, రామిరెడ్డి ముఖ్యపాత్రలు పోషించగా మణిశర్మ సంగీతం సమకూర్చాడు. చోటా కె.నాయుడు ఉత్తమ ఛాయగ్రాహకుడిగా, చంద్రరావు ఉత్తమ మేకప్‌మన్‌గా నంది పురస్కారాలు అందుకున్నారు. 'అంజి' చిత్రం పూర్తిగా గ్రాఫిక్స్‌ మీద ఆధారపడిన సినిమా. ఈ చిత్రానికీ బ్రిటన్‌ యువకుడు క్రిష్‌ గ్రాఫిక్స్‌ అందించాడు. ఈ సినిమా నిర్మాణం ఏకధాటిగా ఆరేళ్లు సాగింది. దాంతో నిర్మాణ వ్యయం అంచనాను దాటిపోయింది. చివరికి 2004 జనవరి 14న సంక్రాంతి కానుకగా 'అంజి' చిత్రం విడుదలైంది. సినిమా గొప్పగా ఆడలేదు కానీ జాతీయ అవార్డుకు ఎంపికైంది. అయితే సినిమా విజయవంతం కానందుకు శ్యాంప్రసాదరెడ్డి మానసికంగా కుంగిపోయాడు. తేరుకోవడానికి చాలాకాలం పట్టింది.

అంజి

అరుంధతితో అంబరానికి...

హీరోయిన్‌ ప్రాధాన్య కథను ఎంపికచేసి ఈ సారి శ్యాంప్రసాద్‌ మంచి చిత్రం 'అరుంధతి'ని నిర్మించాడు. అనుష్క ముఖ్యపాత్ర పోషించగా హిందీ నటులు సోనూ సూద్, షాయాజీ షిండేలను ఇతరపాత్రలకు ఎంపిక చేశారు. సినిమా నిర్మాణానికి అధిక సమయం వెచ్చించినా, బడ్జెట్‌ అనూహ్యంగా రెట్టింపయినా.. వెరవక కోడి రామకృష్ణ నిర్దేశకత్వంలో చిత్రాన్ని అపూర్వంగా నిర్మించాడు శ్యామ్​ ప్రసాద్​.

అరుంధతి

2006 జనవరి 16 సంక్రాంతి కానుకగా విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. ఇంతవరకు విడుదలైన అన్ని తెలుగు సినిమాల వసూళ్లను అధిగమిస్తూ గొప్ప రికార్డును అందుకుందీ చిత్రం. ఈ చిత్రానికి ఏకంగా 10 నంది బహుమతులు లభించాయి. వాటిలో సోను సూద్‌ (ఉత్తమ విలన్‌), అనుష్క శెట్టి (ఉత్తమ నటి) పురస్కారాలను అందుకున్నారు. వీటితో పాటు రెండు ఫిలింఫేర్‌ బహుమతులూ ఈ చిత్రానికి దక్కాయి.

టెలివిజన్‌ మాధ్యమంలో చురుగ్గా...

శ్యాంప్రసాదరెడ్డి ఎంతో ఉత్సాహంగా సినిమా నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి, తొలిరోజుల్లో మంచి చిత్రాలు నిర్మించి విజయాలు మూటకట్టుకున్నాడు. కానీ, అనంతరం భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'ఆగ్రహం', 'అంజి' సినిమాలు నిరుత్సాహపరచడం వల్ల సినిమా నిర్మాణం జూదంలాంటిదని, జయాపజయాలు ఊహించలేనివని శ్యాంప్రసాదరెడ్డి గ్రహించాడు. తండ్రి మాటలు స్పురణకు వచ్చి 'మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌' పేరిట 1992లో ఒక కంపెనీ స్థాపించి బుల్లితెర మాధ్యమంలో కొన్ని టెలివిజన్‌ షోలకు అంకురార్పణ జరిపాడు.

తండ్రి నిర్మించిన శబ్దాలయ స్టూడియో కేంద్రంగా 'జబర్దస్ట్‌- ఖతర్నాక్‌ కామెడీ షో', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్‌', 'ఎక్స్‌ప్రెస్‌ రాజా', 'ఢీ-జోడి', 'పటాస్‌', 'స్టార్‌ మహిళ', 'జీన్స్‌', 'క్యాష్‌' వంటి ప్రాయోజిత కార్యక్రమాలను రూపొందించి ఈ-టీవీ మాధ్యమాల ద్వారా, తమ సొంత యూ-ట్యూబ్‌ ఛానళ్లలోనూ ప్రసారం చేయిస్తూ మంచి పేరు సంపాదించాడు. ఇవి కాకుండా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలనూ ప్రసారం చేయిస్తూ మంచి రేటింగ్‌ సంపాదించాడు. అంతే కాకుండా అనేకమంది యువకులకు ఉపాధి కలిపిస్తూ కళాసేవ చేస్తున్నాడు. ప్రముఖ నటులు నాగేంద్రబాబు, రోజా వంటి నిష్ణాతులైన వారిని న్యాయ నిర్ణేతలుగా నియమించి 'జబర్దస్త్‌' కార్యక్రమాలకు వన్నె తెచ్చాడు.

ఇదీ చూడండి.. నాని ఆ కథను 50 లక్షలకు కొన్నాడట..!

Last Updated : Mar 9, 2020, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details