గడచిన వారం రోజుల్లో కోడి మాంసం ధర అనూహ్యంగా పెరిగిపోయింది. తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.300లకు చేరుకుంది. వేసవిలో కొద్దిమేరకు ధర పెరగడం మామూలే అయినా- ఈ స్థాయి పెరుగుదల సామాన్యులను హడలెత్తిస్తోంది. నిరుడు కరోనా విజృంభించిన తరుణంలో కోడి మాంసంపై ముప్పిరిగొన్న అపోహలతో చాలామంది దాన్ని తినడం ఆపేశారు. దాంతో అప్పట్లో ధర కేజీ రూ.80-50 వరకు పడిపోయింది. చికెన్తో ప్రమాదమేమీ లేదని ప్రభుత్వాలు, పరిశ్రమ వర్గాలు ప్రచారం చేయడం, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా కరోనాను సమర్థంగా ఎదుర్కొనవచ్చని వైద్యులు చెబుతుండటంతో- ప్రజలు తిరిగి కొనుగోళ్లు ప్రారంభించారు. అలా పెరిగిన డిమాండుకు తగిన సరఫరా లేకపోవడం వల్లే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నది ఒక వాదన. కోళ్ల దాణా ప్రియం కావడం, ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు భారమవ్వడంతో ఏడాది తిరిగేసరికి ధర మూడు రెట్లకు పైగా ఎగబాకింది.
పెరిగిన రవాణా ఖర్చులు
కోళ్లదాణాలో కీలకమైన సోయాకేకు ధర ఏడాది కాలంలో 80 శాతానికి పైన పెరిగింది. కొన్ని నెలల్లోనే 30-40 శాతంమేర పెరుగుదల నమోదైంది. దీంతో పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలూ ఆ మేరకు జోరెత్తాయి. సోయాబీన్ను నలగ్గొట్టాక వచ్చే ఈ కేకులో అధిక ప్రొటీన్లు ఉంటాయి. అందుకే కోళ్ల దాణాలో దీన్ని ఎక్కువగా వాడతారు. సోయాబీన్ నిల్వలు ప్రస్తుతం తక్కువగా ఉండటంతో కొంతమంది వ్యాపారులు రంగప్రవేశం చేసి ధరలను కృత్రిమంగా పెంచుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 'అక్టోబరు- మార్చి మధ్యలో 50 లక్షల టన్నుల సోయాబీన్ను నలగ్గొట్టారు. కొత్తపంట వచ్చేలోపు విపణి అవసరాల కోసం ఇంకా 25 లక్షల టన్నుల సోయాబీన్ మాత్రమే మిగిలింది. దీన్ని వ్యాపారులు అవకాశంగా మలచుకుంటున్నారు' అని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక సంచాలకులు బీవీ మెహతా అంటున్నారు. దీనికి తోడు అంతర్జాతీయంగానూ సోయాకేకుకు గిరాకీ ఎక్కువ ఉండటంతో మన దేశం నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయి. ఫలితంగా స్థానికంగా నిల్వలు నిండుకుంటున్నాయి. అక్టోబరు- ఫిబ్రవరి మధ్య 14.35 లక్షల టన్నుల సోయాకేకు ఎగుమతులు జరిగినట్లు భారత సోయాబీన్ ప్రాసెసర్ల సంఘం (సోపా) గణాంకాలు చెబుతున్నాయి. ఏడాది కిందట ఇదే సమయంలో 3.65 లక్షల టన్నుల సోయాకేకు మాత్రమే ఎగుమతి అయ్యింది. ఒకేసారి నాలుగు రెట్లు పెరిగిన ఎగుమతులతో దేశీయ అవసరాలకు కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చు 30 శాతానికి పైగా ఎక్కువైనట్లు అంచనా. దాంతో ఆ మేరకు కోడి మాంసం చిల్లర ధరకూ రెక్కలు మొలిచాయి.
యాభై వేల మందికి ఉపాధి