పారిశ్రామికవెత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో పోలీస్శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. రాకేష్ రెడ్డితో సంబంధాలున్నాయన్న ప్రాథమిక సమాచారంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న ఇబ్రహీంపట్నం సబ్డివిజన్ ఏసీపీ ఎస్.మల్లారెడ్డిపై బదిలీ వేటు పడింది. జయరాంను హత్యచేశాక రాకేష్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట పోలీస్ ఠాణా ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుతో పలుమార్లు మాట్లాడాడని నందిగామ పోలీసులు హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లకు సమాచారమిచ్చారు. స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు వారిద్ధరిని బాధ్యతల నుంచి తప్పించారు. రాకేష్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారా.... అతడు నిర్వహించే పార్టీలకూ హాజరయ్యారా... అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఏసీపీగా వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మల్లారెడ్డిపై ఆరోపణలు నిజమని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీనివాసులుపై గతంలో పలు అవినీతి ఆరోపణలున్నాయి. ఏసీపీ మల్లారెడ్డి ఇబ్రహీంపట్నం సబ్డివిజన్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దినెలలకే అవినీతి అక్రమాలకు తెరలేపాడు. ఈ సమయంలోనే జయరాం హత్యకేసు ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పరిచయం పెంచుకున్నాడని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించారు. మల్లారెడ్డి తొలిసారి గోదావరిఖని డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. కొద్దినెలలకే ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చినందున ఉన్నతాధికారులు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తూనే బదిలీపై రాచకొండ పోలీస్ కమిషనరేట్కు వచ్చారు.
జయరాం హత్య కేసులో ఇద్దరు పోలీసులపై వేటు
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో సంబంధాలున్నాయన్న ప్రాథమిక సమాచారంతో ఇబ్రహీంపట్నం సబ్డివిజన్ ఏసీపీ ఎస్.మల్లారెడ్డిపై వేటు పడింది.
ఏసీపీ ఎస్.మల్లారెడ్డి