మూడు వారాల క్రితం భారీ భూకంపంతో వణికిపోయిన తుర్కియేలో వరుస ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. సోమవారం 5.6 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. మలత్యా రాష్ట్రంలోని యెసిల్యూర్ట్ పట్టణంలో భూమి కంపించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో 69 మంది గాయాలపాలైనట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ ఏఎఫ్ఏడీ తెలిపింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల వచ్చిన భూకంపానికి అనేక ఇళ్లు కుప్పకూలగా.. మరికొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. సోమవారం సంభవించిన భూకంపంతో దెబ్బతిన్న ఇళ్లు పూర్తిగా నేలకొరిగాయని అధికారులు తెలిపారు. సుమారు 25 భవనాలు కూలినట్లు చెప్పారు. పట్టణంలోని ఓ నాలుగు అంతస్తుల భవనం శిథిలాల కింద తండ్రీకుమార్తెలు చిక్కుకోగా.. వారి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తమ ఇంట్లోని వస్తువులను తెచ్చుకునేందుకు తండ్రీకుమార్తెలు భవనంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. వారితో పాటు ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు శిథిలాల గాలింపు చర్యలు చేపట్టాయి. కొన్ని పార్క్ చేసిన వాహనాలపై కూడా భవనాలు కుప్పకూలిపోయినట్లు అధికారులు తెలిపారు.