పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ జాతీయ భద్రతా కమిటీతో సమావేశమయ్యారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో క్లస్టర్ ఆయుధాలతో భారత్ దాడులు చేస్తోందని పాక్ సైన్యం ఆరోపించిన అనంతరం ఈ భేటీ నిర్వహించారు. సమావేశం అనంతరం ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు ఇమ్రాన్.
ప్రస్తుతం జమ్ముకశ్మీర్ విషయంపై సర్వత్రా చర్చ జరుగుతుండగా ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశాన్ని పరిష్కరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తానని అన్నట్లు చెప్పారు.
"కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో నియంత్రణ రేఖ వద్ద భారత భద్రతా దళాలు తీసుకుంటున్న చర్యలు ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పడమే కాకుండా, పరిస్థితులు మరింత క్షీణించేలా చేస్తాయి. ఇది ప్రాంతీయ సంక్షోభానికి దారితీస్తుంది.
సరిహద్దు నియంత్రణరేఖ వద్ద అమాయక ప్రజలపై భారత్ చేస్తున్న దాడులను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నిషేధిత క్లస్టర్ ఆయుధాలను వినియోగించడం నాటి ఒప్పందాలను ఉల్లంఘించడమే. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ ముప్పుగా పరిగణించాలి. ఎంతోకాలంగా కశ్మీర్ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఇది. యూఎన్ఎస్సీ నిబంధనలకు అనుగుణంగా అక్కడి ప్రజలను స్వేచ్ఛగా తిరగనివ్వాలి. దక్షిణాసియాలో శాంతి, భద్రతలు కలిగిన వాతావరణం నెలకొనాలంటే అందుకు కశ్మీర్ సమస్య పరిష్కారం ఒక్కటే మార్గం."
-ఇమ్రాన్ ట్వీట్.
క్లస్టర్ బాంబులు వినియోగిస్తున్నామని పాక్ సైన్యం చేస్తున్న ఆరోపణలు అవాస్తమని భారత్ ఇప్పటికే ఖండించింది.