అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిషేధించడాన్ని రిపబ్లికన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రిపబ్లికన్ నేత, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ.. ట్విట్టర్ చర్యను తీవ్రంగా ఖండించారు. 'అమెరికా.. ఇది చైనా కాదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో.. ట్రంప్ తన సందేశాల ద్వారా మరింత హింసను ప్రోత్సహించే ప్రమాదముందంటూ ట్విట్టర్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల ఆయన చేసిన ట్వీట్లను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
అమెరికా... ఇది చైనా కాదు: నిక్కీ హేలీ - ట్రంప్ ట్విటర్ ఖాతాపై నిషేధం
ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిషేధించడంపై రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ చర్యను తప్పుపట్టారు రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ.

'ప్రజలను మాట్లాడకుండా చేసేది చైనాలో.. మన దేశంలో కాదు. నమ్మశక్యంగా లేదు' అని నిక్కీ హేలీ ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన క్యాపిటల్ భవనం దాడి ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. ఈ క్రమంలో ఫ్లోరిడాలో రిపబ్లికన్ నేషనల్ కమిటీ అంతర్గత సమావేశంలో ఆమె పాల్గొన్నారు. క్యాపిటల్ భవనంపైకి దాడి చేసేలా ప్రేరేపించిన ట్రంప్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఎప్పుడూ సరైన పదాలను ఉపయోగించలేదన్నారు. ఆయన చర్యలను చరిత్ర కఠినంగా పరిగణిస్తుందని వ్యాఖ్యానించారు. నిక్కీ ఐరాసలో యూఎస్ రాయబారిగా విధులు నిర్వర్తించారు.
ఇదీ చదవండి:గజగజా వణుకుతూ.. మంచులో విహరిస్తూ..