అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైతే ఆయన కుమార్తె ఇవాంకా శ్వేతసౌధంలో కొనసాగుతారా.. లేదా.. అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆమె ట్రంప్ పాలకవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. సీబీఎస్ ఛానెల్లో ప్రసారం అయ్యే ‘ఫేస్ ది నేషన్’ కార్యక్రమంలో తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలే ఈ సందేహాలకు తెరతీశాయి. తిరిగి ట్రంప్ పాలకవర్గానికి సేవలందించనున్నారా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ...‘‘నా పిల్లలు, వారి సంతోషమే నా తొలి ప్రాధాన్యం. వారి అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగానే నా నిర్ణయాలు ఉంటాయి’’ అని సమాధానం ఇచ్చారు.
తన పదవీ కాలంలో అనేక వర్గాలకు సేవ చేసేందుకు కృషి చేశానని ఇవాంకా తెలిపారు. గత రెండున్నరేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా పర్యటించాను.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. ‘భవిష్యత్తులో అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందా’ అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ..‘‘నిజాయితీగా చెప్పాలంటే నాకు రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదు’’ అని అన్నారు.