పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసను ఎదుర్కొనేందుకు విపక్షాలు శ్రమిస్తున్నాయి. ఓట్ల వేటలో వెనకబడిపోకుండా... అధికార పక్షంతో సై అంటే సై అన్నట్లుగా ప్రచారం సాగిస్తున్నాయి. గులాబీ నేతలపై విమర్శలు గుప్పిస్తూ... హామీల అమలు, కొలువుల భర్తీపై నిలదీస్తున్నాయి.
భాజపా విస్తృత ప్రచారం..
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి భాజపా అభ్యర్థి రాంచందర్రావు.... నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై పోరాడే వ్యక్తి అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాగర్కర్నూలులో నిర్వహించిన ప్రచారంలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి సంజయ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి ఓటు వేసిన ప్రతి ఒక్కరు తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని డీకే అరుణ అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పాల్గొన్నారు. భాజపా అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి ఓటు వేసి గెలిపించాలన్నారు.
ప్రజలకు అన్యాయం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది ఏమీ లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆక్షేపించారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర సర్కారు.... విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం... రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారని అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక నేతలతో కలిసి ఉత్తమ్ ప్రచారం నిర్వహించారు. తెరాస, భాజపా నేతల మాయమాటలకు మోసపోకుండా తనకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి నాగర్ కర్నూలులో కోరారు.