హైదరాబాద్లో కరోనా లక్షణాలున్న వారు, ప్రైమరీ కాంటాక్టులు తెల్లవారుజాము నుంచే ఆయా కేంద్రాలకు వెళుతున్నారు. చాలా చోట్ల రోజుకు 30కి మించి పరీక్షలు చేయడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాల వద్ద పలు సమస్యలు తలెత్తుతున్నాయి.
ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులంటే...
- శేరిలింగంపల్లి పీహెచ్సీలో తక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారు. అనుమానితులు రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది.
- షాపూర్నగర్, కుత్బుల్లాపూర్, గాజులరామారం, సూరారం కేంద్రాల వద్ద వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. ఒక్కో కేంద్రానికి రోజు 25 పరీక్ష కిట్లు మాత్రమే అందిస్తున్నారు.
- కొందరు పైరవీలు చేయించుకొని వెళుతుండడం వివాదాలకు దారితీస్తోంది.
- మోండా మార్కెట్ డివిజన్లోని 3 బస్తీ దవాఖానాల్లో కనీసం రక్తపరీక్షలు చేయడం లేదు.
- భోలక్పూర్, ముషీరాబాద్ యూపీహెచ్సీలకు పెద్ద సంఖ్యలో అనుమానితులు వస్తున్నారు. వసతులు లేక అవస్థలు పడుతున్నారు. రోజుకు 25 మందికే పరీక్షలు చేస్తున్నారు.
- హోంఐసోలేషన్ కిట్లు రోజుల తరబడి ఆలస్యంగా ఇస్తున్నారు. కొన్ని మందులు లేకపోవడం వల్ల బయట కొనాల్సి వస్తోంది.
- బైబిల్హౌస్ యూపీహెచ్సీని భోలక్పూర్ డివిజన్ రంగానగర్లో ఇరుకైన అద్దెభవనంలో నిర్వహిస్తున్నారు. వైద్యాధికారి లేకపోవడం వల్ల ప్రాథమిక వైద్యం అందడంలేదు.
- కాచిగూడ నెహ్రూనగర్ హర్రాస్పెంట యూపీహెచ్సీలోని కేంద్రానికి ఉదయం 11 గంటలకు కూడా సిబ్బంది రావడం లేదు.
- మల్కాజిగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సిబ్బంది లేక పరీక్షలు నిలిపివేశారు. ఆ ప్రభావం నేరేడ్మెట్, మౌలాలి, మల్లికార్జున్నగర్లలోని పీహెచ్సీలపై పడింది. హోంఐసోలేషన్ కిట్లు, సరిపడ మందులు ఇవ్వకపోవడంతో బయటకు వచ్చేస్తున్నారు.
- మల్లాపూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆరు బస్తీ దవాఖానాల్లో ఇంకా పరీక్షలు ప్రారంభం కాలేదు. ఒక్క యూపీహెచ్సీ కేంద్రంలోనే పరీక్షలు చేయడం వల్ల వేకువజాము 3 గంటల నుంచే జనం బారులు తీరుతున్నారు.
- చర్లపల్లి డివిజన్లో రెండు పీహెచ్సీలు, రెండు బస్తీ దవాఖానాలున్నా ఎక్కడా పరీక్షలు చేయడం లేదు. రోజూ అనుమానితులు వచ్చి వెళుతున్నారు.
- బంజారాహిల్స్ రోడ్డు నం.3 షౌకత్నగర్ బస్తీలోని యూపీహెచ్సీలో రోజూ 50-60 మంది పరీక్షలు చేయించుకుంటున్నారు. మంచినీటి కొరత నెలకొంది.
- ఉప్పల్లో పీహెచ్సీ వద్ద చినుకు పడితే పరీక్షలు చేసేది లేదంటూ బాధితులను వెనక్కి పంపిస్తున్నారు.
- ల్యాబ్ టెక్నీషియన్కు పాజిటివ్ వచ్చిందని కుషాయిగూడ పీహెచ్సీలో పరీక్షలు ఆపేశారు.
- యాఖుత్పురాలోని పీహెచ్సీల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది.
- ప్రతిభనగర్లో 15 రోజులుగా తాళం
జిల్లాల వారీగా కొవిడ్-19 పరీక్ష కేంద్రాలు
హైదరాబాద్: 97
రంగారెడ్డి: 20
మేడ్చల్: 79
గ్రేటర్లో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు: 35 వేలకు పైనే
ఇవీ ప్రధాన లోపాలు
తక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారు.