రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన ధాన్యం రైస్ మిల్లులకు వచ్చిన తర్వాత తాలు పేరిట తరుగు తీయడం అన్యాయమని... తేమ అంటూ రైతులను ఇబ్బందులు పెడితే మిల్లర్లపై చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఈ విషయంలో ప్రధానంగా నల్గొండ జిల్లాలో పత్రికల్లో వస్తున్న వార్తలపై విచారణ జరిపి వాస్తవ పరిస్థితులు నివేదించాలని పౌరసరఫరాల సంస్థ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పౌరసరఫరాల భవన్లో ధాన్యం కొనుగోళ్లు, మార్కెటింగ్, ఆర్థిక శాఖ అధికారులతో ఛైర్మన్ సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలను తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాల వారిగా ప్రతిరోజూ ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలని చెప్పారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కరోనా ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై ఏ మాత్రం పడకుండా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు ముడిపడి ఉన్న వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, తదితర విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.