రాష్ట్రంలో ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో మరోసారి యాంటీబాడీ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని కరోనా పోరాటయోధులైన పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, మీడియా సిబ్బందికి ఈ పరీక్షలు చేయనున్నారు. సచివాలయంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ముఖ్య కార్యదర్శి శాంతికుమారితో ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు శనివారం సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు యాంటీబాడీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సామాజిక వ్యాప్తి లేదని వెల్లడైంది. తాజాగా మూడోసారి జీహెచ్ఎంసీలో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
2వేల మందికి
దేశంలో తొలి దశ కింద మెట్రో నగరాలైన ముంబయి, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 2 వేల మందిని ఎంపిక చేసి యాంటీబాడీ పరీక్షలు చేస్తారు. ఒక్కో విభాగం నుంచి కొందరిని ఎంపిక చేసి గ్రూపులుగా విభజిస్తారు. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న పోరాట యోధులకు పరీక్షలు చేస్తారు. శరీరంలో వృద్ధిచెందిన యాంటీబాడీస్ ద్వారా ఎంత మందికి కరోనా వచ్చి పోయిందో ఈ పరీక్షల ద్వారా తెలియనుంది. యాంటీబాడీస్ కనిపించిన, కనిపించని వారిలో రోగ నిరోధకశక్తిని పరిశీలిస్తారు.