tspsc paper leakage latest updates: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులైన ప్రవీణ్కుమార్, రాజశేఖర్లను.. సిట్ కస్టడీలోకి తీసుకొని విచారించింది. కస్టడీలోనూ ప్రవీణ్కుమార్ తనకేం తెలియదని పోలీసులను ఏమార్చే ప్రయత్నం చేశారు. నిందితులు కొన్నివిషయాల్ని కావాలనే దాచిపెడుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ప్రశ్నపత్రాలు కాజేసేందుకు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మి డైరీలో రాసుకున్న యూజర్ ఐడీ, పాస్వర్డ్ను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.
సిట్ కస్టడీలో ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి ఒకే విధమైన సమాధానం ఇచ్చారు. అయితే శంకరలక్ష్మి డైరీని స్వాధీనం చేసుకొని పరిశీలించిన అధికారులు.. అందులో ఎక్కడా యూజర్ ఐడీ, పాస్వర్డ్ రాసినట్లు ఆధారాలు లేవని తేల్చారు. సిట్, ఈడీ విచారణలోనూ.. శంకరలక్ష్మి అదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం. అయితే అత్యంత రహస్యంగా ఉండే యూజర్ ఐడీ, పాస్వర్డ్ నిందితులకు ఎలా చిక్కిందనేది అంతుపట్టని ప్రశ్నగా మారింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్లో 100కు పైగా మార్కులు సాధించిన రాజశేఖర్ రెడ్డి బంధువు ప్రశాంత్.. న్యూజిలాండ్లో ఉన్నట్లు సిట్ గుర్తించింది. అతనికి వాట్సప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. స్పందించిన ప్రశాంత్.. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం తనకు అందలేదని సిట్ అధికారులకు వాట్సప్ ద్వారా సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన వారిలో మరికొందరు అనుమానితుల జాబితాను సిట్ రూపొందించినట్లు తెలుస్తోంది.