నారదా కుంభకోణం కేసులో టీఎంసీ మంత్రులు, ఇతర నేతలను సీబీఐ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తృణమూల్ జెండాలను పట్టుకొని సీబీఐ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆందోళనకారులను నిలువరించేందుకు భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ జవాన్లు రంగంలోకి దిగారు. సీబీఐ కార్యాలయం ఉన్న నిజాం ప్యాలెస్ వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే వాటిని కార్యకర్తలు దాటే ప్రయత్నం చేయడం వల్ల.. అక్కడ ఉద్రిక్తతలకు దారి తీసింది. సీఆర్పీఎఫ్తో పాటు కోల్కతా నగర పోలీసులు సైతం మోహరింపులు చేపట్టారు.
అంతకుముందు.. పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్న వెంటనే బంగాల్ సీఎం మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.