తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2021, 3:43 PM IST

ETV Bharat / bharat

ఉగ్రవేటలో ఎన్​ఐఏ- కశ్మీర్​లో విస్తృత సోదాలు

రెండేళ్ల క్రితం నిషేధం విధించిన జమాత్​-ఏ-ఇస్లామీ మత సంస్థకు చెందిన సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) విస్తృత సోదాలు నిర్వహించింది. జమ్ముకశ్మీర్​లోని 45 ప్రాంతాల్లో ఆదివారం ఈ తనిఖీలు చేపట్టింది. మరోవైపు.. కర్ణాటక బెంగళూరులోనూ ఎన్​ఐఏ సోదాలు నిర్వహించింది.

nia raids
ఎన్​ఐఏ సోదాలు

జమ్ముకశ్మీర్​లోని నిషేధిత మత సంస్థ జమాత్-ఏ-ఇస్లామీ(జేఈఎల్​)కి చెందిన సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) ఆదివారం విస్తృత సోదాలు నిర్వహించింది. జేఈఎల్​ సభ్యులు ఇళ్లు, కార్యాలయాలు కలిపి 45 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిందని అధికారులు చెప్పారు. కశ్మీర్​లోని అన్ని జిల్లాలు, రంబాన్, కిష్ట్వార్​, దోడా, రౌజౌరీ సహా జమ్ములోని కొన్ని జిల్లాలో ఈ గాలింపు చర్యలు చేపట్టిందని వెల్లడించారు.

రెండేళ్ల క్రితమే నిషేధం..

ఉగ్రవాదులతో సన్నిహత సంబంధాలు ఉండటం సహా వేర్పాటువాద ఉద్యమాన్ని బలపరుస్తున్నారన్న కారణంతో ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జేఈఎల్​పై 2019 ఫిబ్రవరిలో ఐదేళ్లపాటు కేంద్రం నిషేధం విధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశం అనంతరం కేంద్రం హోం శాఖ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తదనంతరం.. చెలరేగిన అలర్లలో వందలాది మంది జేఈఎల్​ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు, సీఆర్​పీఎఫ్​ సిబ్బంది సహకారంతో ఎన్​ఐఏ తాజా సోదాలను నిర్వహించిందని అధికారులు తెలిపారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సంస్థ సభ్యులు ఉగ్రవాద కార్యకలపాలకు పాల్పడుతన్నారని నమోదైన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించామని పేర్కొన్నారు.

బెంగళూరులోనూ..

బంగ్లాదేశ్​కు చెందిన మానవ అక్రమ రవాణాదారుల కోసం, వారి బాధితుల కోసం నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకునేందుకు కర్ణాటక బెంగళూరులో ఎన్​ఐఏ సోదాలు నిర్వహించింది. బెంగళూరులోని రెండు ప్రాంతాల్లో శనివారం ఈ తనిఖీలు నిర్వహించామని అధికారులు తెలిపారు.

ఉద్యోగం పేరుతో తీసుకువచ్చి..

మానవుల అక్రమ రవాణాకు పాల్పడతున్నారని 13 మంది నిందితులపై బెంగళూరులోని రామ్మూర్తి నగర్​ పోలీసులు జూన్​లో కేసు నమోదు చేశారు. వారి చెర నుంచి ఏడుగురు బంగ్లాదేశీ మహిళలను, ఓ చిన్నారిని పోలీసులు రక్షించారు. ఈ మహిళలను బంగ్లాదేశ్​ నుంచి ఉద్యోగం పేరుతో నిందితులు తీసుకువచ్చి, వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.

దీనిపై ఎన్​ఐఏ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా శనివారం ఈ సోదాలు నిర్వహించింది. నేర సంబంధిత పత్రాలు సహా ఆరు డిజిటల్​ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

ఇదీ చూడండి:'కశ్మీరీల బాధను మాటల్లో చెప్పలేం'

ఇదీ చూడండి:ఉగ్రదాడిలో పోలీసు మృతి, మరో ఇద్దరికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details