దేశంలో కొవిడ్-19 విజృంభణ తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజాగా ఒక వివరణ పత్రాన్ని విడుదల చేసింది. ఐబూప్రొఫెన్ వంటి కొన్ని నొప్పి నివారణ మందుల వల్ల కరోనా బాధితుల్లో పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గుండె వైఫల్య సమస్య ఉన్న రోగులకు అవి హానికరం కావొచ్చని పేర్కొంది. మూత్రపిండాలు కూడా దెబ్బతినొచ్చని తెలిపింది. అందువల్ల ఇలాంటి నాన్-స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ)కు దూరంగా ఉండాలని సూచించింది. కొవిడ్ సోకినప్పుడు అవసరమైతే పారాసెటిమాల్ ఔషధాన్ని తీసుకోవాలని పేర్కొంది.
► అధిక రక్తపోటుకు చికిత్స కోసం వాడే ఏసీఈ ఇన్హిబిటర్లు (రామిప్రిల్, ఎనాలాప్రిల్ వంటివి), యాంజియోటెన్సిన్ రెసెప్టార్ బ్లాకర్లు (ఏఆర్బీలు.. లోసార్టాన్, టెల్మిసార్టాన్ తదితరాలు) వల్ల కొవిడ్ ముప్పు లేదా తీవ్రత పెరుగుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. దీనికి సంబంధించిన అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించాక.. వివిధ శాస్త్రీయ సంఘాలు, హృద్రోగ చికిత్స నిపుణుల బృందాల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైంది. గుండె వైఫల్యాన్ని నియంత్రించడంలో ఈ ఔషధాలు సమర్థంగా పనిచేస్తాయి. గుండె పనితీరుకు తోడ్పాటు ఇవ్వడం, అధిక రక్తపోటును నియంత్రించడం ద్వారా అవి మేలు చేస్తాయి. అందువల్ల బాధితులు తమంతట తాము ఈ ఔషధాలను ఆపేయడం ప్రమాదకరం.
► ఇతరులతో పోలిస్తే.. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారికి కొవిడ్ సోకే ముప్పు ఎక్కువగా ఉండదు. అయితే ఈ సమస్యలున్నవారికి కరోనా సోకినప్పుడు వ్యాధి లక్షణాలు తీవ్రం కావొచ్చు. అందువల్ల వారి విషయంలో అదనపు జాగ్రత్తలు అవసరం.
► ఒక మోస్తరు స్థాయిలో కొవిడ్ లక్షణాలున్నప్పటికీ.. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులున్న వారు తాము సాధారణంగా వాడే మందులను ఉపయోగించవచ్చు. వైద్యుడు చెబితే తప్ప ఏ మందులనూ ఆపకూడదు. డాక్టర్ వద్దకు వెళ్లే పరిస్థితి లేకపోతే అప్పటికే వాడుతున్న ఔషధాలను యథాతథంగా కొనసాగించవచ్చు. కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి వాడే స్టాటిన్లనూ కొనసాగించాలి.
► మధుమేహం ఉన్న వారు కొవిడ్ బారినపడితే రక్తంలో గ్లూకోజ్ను తరచూ పరీక్షించుకుంటూ అందుకు తగ్గట్టు ఇన్సులిన్తో సహా అన్ని మందులనూ సర్దుబాటు చేయాలి. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు భోజనం చేస్తూ, సరిపడా ద్రవాలు తీసుకోవాలి.