ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువతి.. స్వదేశానికి వచ్చి సర్పంచ్గా గెలుపొందారు. మహారాష్ట్రలోని మిరాజ్ (సంగ్లీ) జిల్లాలోని వడ్డి గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. గ్రామానికి చెందిన యశోదర రాజే శిందే(21).. మూడేళ్ల నుంచి జార్జియాలో ఉంటున్నారు. ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్నారు. చదువు మధ్యలో ఉండగానే సర్పంచ్ ఎన్నికల కోసం స్వదేశానికి వచ్చి ఎన్నికల బరిలోకి దిగారు. పంచాయతీ ఎన్నికలకు ముందు గ్రామంలో శిందే కుటుంబం.. రేణుకాదేవి గ్రామ్ వికాస్ సర్కార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకొంది. అయితే, సర్పంచ్గా ఎవరిని నిలబెట్టాలని తొలుత సమాలోచనలు జరిపింది. చివరకు మహేంద్ర సింగ్ శిందే కుమార్తె యశోదర రాజేను ఎంపిక చేశారు. ఆమెనే ఎన్నికల్లో నిలబెట్టాలని నిర్ణయించారు.
శిందే కుటుంబం దశాబ్దాలుగా ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంది. వడ్డి గ్రామానికి పక్కనే ఉన్న నర్వాడ్ పంచాయతీకి యశోదర రాజే ముత్తాత 25 ఏళ్ల పాటు సర్పంచ్గా పనిచేశారు. నాయనమ్మ మందాకిని రాజే శిందే సైతం నర్వాడ్ సర్పంచ్గా ఐదేళ్లు సేవలందించారు. యశోదర రాజే తండ్రి మహేంద్ర సింగ్ శిందే సైతం రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వారసురాలిగా యశోదరను గ్రామస్థులు సర్పంచ్గా నిలబెట్టాలని భావించారు. దీంతో ఎన్నికల్లో నిలబడటం, గెలవడం అన్నీ చకచకా అయిపోయాయి. పెద్దగా సన్నద్ధత లేకుండానే బరిలోకి దిగారు యశోదర. ప్రచారంలో స్థానికుల నుంచి సానుకూల స్పందన అందుకున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న జకీర్ వాజిర్పై 149 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
"నా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడం కష్టం కాలేదు. కుటుంబం, గ్రామస్థుల మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధించగలిగాను. ఈ విజయం వారిదే. మేం ఇచ్చిన హామీలన్నింటినీ ఐదేళ్లలో నెరవేరుస్తాం. మంచి సౌకర్యాలతో పాఠశాలలు నిర్మిస్తాం. అధునాతన విద్య అందిస్తాం. ఈ-లెర్నింగ్ను ప్రవేశపెడతాం. విదేశాల్లో మాదిరిగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం."
-యశోదర రాజే