Delhi covid restrictions: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో దిల్లీలో 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో బస్సుల్లో 50శాతం మందినే అనుమతించడంపై కొంతమంది దిల్లీవాసులు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డును దిగ్బంధించడమే గాకుండా.. దిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ)కి చెందిన బస్సులను ధ్వంసం చేశారు.
Delhi buses news: "గురువారం ఉదయం 10:30 గంటలకు కొంతమంది దిల్లీలోని ఎంబీ రోడ్డును దిగ్భందించారు. డీటీసీకి చెందిన బస్సుల అద్దాలను పగలగొట్టారు. కొవిడ్ నిబంధనల కారణంగా బస్సులో సీట్లు దొరక్కపోవడం వల్లే వాళ్లు ఈ విధంగా ప్రవర్తించారు" అని దిల్లీ(దక్షిణ) అదనపు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం.హర్షవర్ధన్ వివరించారు.
మెహ్రాలీ-బదర్పుర్ రోడ్డులో జామియా హమ్దర్ద్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని గురువారం ఉదయం తమకు ఫోన్ కాల్స్ వచ్చాయని దిల్లీ(దక్షిణ) డిప్యూటీ కమిషనర్(డీసీపీ) బెనితా మేరీ తెలిపారు. దిల్లీ ప్రభుత్వం.. తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం బస్సుల్లోకి 17 మందిని మించి అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంతమంది ప్రయాణికులు ఆ ప్రాంతంలో రోడ్డుపై బైఠాయించారని చెప్పారు.