కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో సమాచార కమిషనర్లను 3నెలల్లో నియమించాలని ఆయా ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. నేటి నుంచే నియామక ప్రక్రియను ప్రారంభించాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బోబ్డేతో కూడిన ధర్మాసనం నిర్ధేశించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 15న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఆయా ప్రభుత్వాలు సమాచార కమిషనర్లను నియమించాల్సి ఉండగా.. ఆలస్యం చేయడంపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటీషన్ వేశారు. ఈ మేరకు సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. సమాచార కమిషనర్లను వెంటనే నియమించాలని స్పష్టం చేసింది.
సమాచార కమిషనర్లు, సభ్యులను నియమించిన రెండు వారాల్లో వారి వివరాలను ప్రభుత్వ వెబ్సైట్ లో ఉంచాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో సమాచార హక్కు చట్టం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కొన్ని మార్గదర్శకాలు అవసరం అని సూచించింది.
" మేము సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకం కాదు. అయితే దీని అమలుకు కొన్ని మార్గదర్శకాలు అవసరం ఉందని గుర్తించాం. సమాచారం కోసం వచ్చే దరఖాస్తుల్లో కొన్ని దురుద్దేశంతో చేసేవి ఉంటాయి. వాటిని నివారించేందుకు మార్గదర్శకాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది." అని ధర్మాసనం వివరించింది.