నరేంద్రమోదీ అహంకారం సమస్యతో బాధపడుతున్నారని, ప్రధానమంత్రిలా కంటే ఎక్కువగా ప్రచారాల మంత్రిగానే వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ భయంతో ఉన్నట్లు ఆయన ప్రవర్తనలో తెలుస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు.
ఎన్నికల అనంతరం 'రాహులే ప్రధానమంత్రి' అన్న అభిప్రాయంపై స్పందించారు కాంగ్రెస్ అధ్యక్షులు. దీని గురించి మాట్లాడటం అహంకారం అవుతుందని, ప్రజలే అంతిమ నిర్ణేతలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో మోదీపై విమర్శల వర్షం కురిపించారు.
''మోదీకి ఉన్న అహంకారం, అధికార దాహం, స్వంత ప్రచారం విఫలమౌతున్నపటికీ దానిపై ఉన్న ఆసక్తి, భారత్లోని ప్రతి ఒక్కరి సమస్యకు తనవద్దే పరిష్కారం ఉందనే అపనమ్మకం వల్ల ఎవరినీ సంప్రదించకపోవటం వల్ల ప్రధానమంత్రి సమస్యలను ఎదుర్కొంటున్నారు.''
లోక్సభ ఎన్నికల ముందు చివరిసారిగా ప్రధానమంత్రికి ఇచ్చే సందేశంపై అడగగా... తనదైన శైలిలో విరుచుకుపడ్డారు రాహుల్. నిరుద్యోగం, రైతులు, ఆర్థిక వ్యవస్థ వైఫల్యం, మోదీ వ్యక్తిగత అవినీతిలే తన సందేశమని సమాధానమిచ్చారు. దీంతోపాటు ఎన్నికలను ప్రభావితం చేయగల అంశాలపై స్పష్టతనిచ్చారు.
''సంస్థలను నాశనం చేయటం, ద్వేషం పెరగటం, సమాజంలో హింస, షెడ్యూల్డ్ తరగతుల హక్కులపై దాడి లాంటి తదితర అంశాలను ఓటర్లు పరిగణనలోకి తీసుకుంటారు. 2014లో ఇచ్చిన తప్పుడు హామీలు, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల జమ ప్రకటన, 2 కోట్ల ఉద్యోగాల సృష్టి, 100 స్మార్ట్ సిటీల నిర్మాణం, విదేశాల్లో ఉన్న 80 లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి తెప్పించటం లాంటివే ఎన్నికలకు ప్రధాన అంశాలు.''
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకం న్యాయ్(న్యూన్తమ్ ఆయ్ యోజన) అమలు చేస్తామని ఇటీవలే ప్రకటించారు రాహుల్గాంధీ.
"భాజపా సృష్టించిన కారు చీకట్ల మధ్య కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన న్యాయ్ ఒక వెలుగురేఖ. దీనికి ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి ఉంది. ఇది ఎన్నికలకు కీలకమైన అంశంగా మారుతుంది."
-