తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కలల కశ్మీరం నిర్మిద్దాం రండి: ప్రజలకు మోదీ పిలుపు - jammu

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్ ప్రజల బంగారు భవిత కోసమే  ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చినట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇది చరిత్రాత్మక నిర్ణయమని పునరుద్ఘాటించారు. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద నిర్మూలన, అభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహకరిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కశ్మీర్ అంశంపై తొలిసారి జాతినుద్దేశించి గురువారం రాత్రి ప్రసంగించారు మోదీ.

కలల కశ్మీరం నిర్మిద్దాం రండి: ప్రజలకు మోదీ పిలుపు

By

Published : Aug 9, 2019, 5:24 AM IST

Updated : Aug 9, 2019, 9:01 AM IST

కలల కశ్మీరం నిర్మిద్దాం రండి: ప్రజలకు మోదీ పిలుపు

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించిన తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి నిన్న రాత్రి ప్రసంగించారు ప్రధాని నరేంద్రమోదీ. కేంద్రం నిర్ణయం.. జమ్ముకశ్మీర్లో నూతనశకానికి నాందిగా అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దుతో శ్యామాప్రసాద్​ ముఖర్జీ, అటల్​బిహారీ వాజ్​పేయీ, సర్దార్ వల్లభాయ్ పటేల్​ సహా కోట్లాది మంది ఆకాంక్షలు సాకారమయ్యాయని చెప్పారు మోదీ. ఆర్టికల్ 370, 35-ఏతో కశ్మీరీలకు ఒనగూరిన ప్రయోజనాలేంటో వ్యతిరేకించేవారు చెప్పగలరా అని ప్రశ్నించారు.

"ఒక దేశంగా, ఒక కుటుంబంగా, మీరు, మేము మొత్తం దేశం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. ఒక వ్యవస్థ కారణంగా జమ్ముకశ్మీర్, లద్దాఖ్​కు చెందిన సోదర, సోదరీమణులు అనేక హక్కులు కోల్పోయారు. వారి అభివృద్ధికి అది అడ్డంకిగా నిలిచింది. మనందరి ప్రయత్నాల కారణంగా ఆ వ్యవస్థ దూరమైంది. సర్దార్​ వల్లభాయ్​పటేల్, బాబా సాహెబ్ అంబేడ్కర్, డాక్టర్​ శ్యామ ప్రసాద్​ముఖర్జీ, అటల్​జీ సహా కోట్లాది మంది దేశ భక్తుల స్వప్నం ఇప్పుడు నేరవేరింది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్​లో కొత్త శకం ప్రారంభమైంది. ఇప్పుడు దేశంలో ప్రజలందరి హక్కులూ, బాధ్యతలూ సమానమే."
-నరేంద్ర మోదీ, ప్రధాని.

ఉగ్రవాదానికి చరమగీతం

ఇన్నాళ్లు అధికరణ 370ని అడ్డుపెట్టుకొని.. జమ్ముకశ్మీర్లో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరించిందని మండిపడ్డారు ప్రధాని. దీనితో కశ్మీరీ సామాన్యులకు ఏం ప్రయోజనం చేకూరిందని ప్రశ్నించారు. అవినీతి పెరిగి వారి బతుకులు ఛిన్నాభిన్నం అయ్యాయని అన్నారు. కుటుంబపాలనలో ఆ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. గడిచిన 30 ఏళ్లలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా కశ్మీర్​లో 42 వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.

ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి అమరులయ్యారన్నారని గుర్తు చేశారు మోదీ. వారిని భారత ప్రభుత్వం కీర్తిచక్ర, పరమవీరచక్ర, శౌర్య చక్ర పురస్కారాలతో సత్కరించిందని చెప్పారు. జమ్ముకశ్మీర్ నుంచి ఉగ్రవాదం పూర్తిగా తొలిగిపోయి.. అభివృద్ది పథంలో అడుగులు వేసిన వెంటనే కేంద్రపాలిత ప్రాంతం నుంచి పూర్తి స్థాయి రాష్ట్రంగా మళ్లీ మారుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

అభివృద్ధి పథంలో ముందుకు

70 ఏళ్లుగా కుటుంబపాలనతో సతమతం అవుతున్న జమ్ముకశ్మీర్​లో యువకులకు ఎక్కువ ప్రాధాన్యం ఉండే కొత్త ప్రభుత్వం కొలువుతీరి.. అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తుందని మోదీ ఆకాంక్షించారు. కశ్మీరీ యువత వేర్పాటువాదాన్ని వీడి కొత్త ఆశలు, స్వప్నాలతో ముందుకు సాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గవర్నర్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ది కొనసాగుతోందన్న మోదీ.. తర్వాత ఏర్పాటయ్యే ప్రజా ప్రభుత్వం కూడా పూర్తి పారదర్శకతతో కూడిన పాలన అందిస్తుందని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. సైన్యంలో, పారామిలటరీలో కశ్మీరీ యువతకు ప్రాధాన్యం పెంచడం సహా.. జమ్ముకశ్మీర్​లో పనిచేసే పోలీసులు, ఇతర ఉద్యోగులకు కేంద్రపాలిత ప్రాంతాల్లో లభించే సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు ప్రధాని.

"త్వరలోనే జమ్ముకశ్మీర్​లోని అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ కల్పన ప్రోత్సహిస్తాం. సైన్యం, పారామిలటరీ దళాల ద్వారా స్థానిక యువకుల భర్తీ కోసం ప్రత్యేక ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేస్తాం."
-నరేంద్ర మోదీ, ప్రధాని.

పర్యటకంపై ప్రత్యేక దృష్టి

భూతల స్వర్గంగా పిలిచే కశ్మీర్‌ ఇన్నాళ్లు ఉగ్రవాదం బారినపడి అనేక సవాళ్లు ఎదుర్కొందన్నారు మోదీ. త్వరలో శాంతియుత వాతావరణం ఏర్పడి పర్యటకం అభివృద్ధి చెందుతుందన్నారు. తిరిగి కశ్మీర్‌లో చిత్రీకరణలు మొదలుపెట్టాలని సినీ పరిశ్రమలకు సూచించారు. కశ్మీరీ కుంకుమ సహా లద్ధాఖ్‌ మూలికలకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తామన్నారు.

త్వరలోనే సాధారణ పరిస్థితులు

భద్రతాబలగాల పహారాలో ఉన్న జమ్ముకశ్మీర్​లో పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని మోదీ తెలిపారు. సోమవారం జరగనున్న ఈద్​ వేడుకల కోసం ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

జమ్ముకశ్మీర్ అంశంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తామన్నారు మోదీ. ఇదే సమయంలో వారు జమ్ముకశ్మీర్ ప్రగతికి అడ్డురావొద్దని కోరారు.

Last Updated : Aug 9, 2019, 9:01 AM IST

ABOUT THE AUTHOR

...view details