దేశ ప్రజలు ఇచ్చిన ఘన విజయాన్ని ఆసరాగా చేసుకొని మొదటి రోజు నుంచే భారీ సంస్కరణలు, పెద్దస్థాయి నిర్ణయాలు, గొప్ప ఆలోచనలతో ముందుకు వెళ్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండో పర్యాయం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం ఆయన 'వికాస్ యాత్ర' పేరుతో ప్రభుత్వం సాధించిన విజయాలపై వెబ్సైట్, ట్విట్టర్లలో పత్రాలను విడుదల చేశారు. మొత్తం 15 శీర్షికల కింద వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని ఇందులో పొందుపరిచారు. మొదటి పర్యాయం పాలన చూసిన తరువాత ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టారని, ప్రజాస్వామ్య సమాజాల్లో ఇది అరుదైన విషయమని ప్రధాని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు పెరిగాయని, దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. "జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్లకు కొత్త ఉదయాన్ని చూపించడం, కార్పొరేట్ పన్నులను తగ్గించడం, రైతులు, వ్యాపారులకు పింఛన్లు ఇవ్వడం, అయోధ్య సమస్యను శాంతియుతంగా పరిష్కరించడం" వంటి విజయాలను అందులో ప్రస్తావించారు. నిజాయతీని గౌరవించడం, పారదర్శకతను ప్రోత్సహించడం అన్న సాధనాలతో అవినీతిపై యుద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
పనిచేస్తూ పోతే... విజయం అదే వస్తుంది
ఈసందర్భాన్ని పురస్కరించుకొని మోదీ జాతినుద్దేశించి లేఖ కూడా రాశారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తూ పోతుంటే విజయం దానంతట అదే వస్తుందని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలను లేఖలో వివరించారు. ‘‘నేను రాత్రింబవళ్లు పనిచేస్తున్నా. నాలో ఏమైనా లోపాలు ఉండొచ్చు కానీ మన దేశానికి ఎలాంటి లోపం లేదు. నాకు నా మీదకంటే మీ మీద, మీ బలం, సామర్థ్యం మీద ఎక్కువ నమ్మకం ఉంది’’ అని తెలిపారు. కరోనా కారణంగా వలస కూలీలు సహా వివిధ వర్గాల వారు ఇబ్బందులు పడ్డారని, అయినా అందరూ కలసికట్టుగా ఈ మహమ్మారిపై పోరాడుతున్నారని వివరించారు.
ఇవీ విజయాలు
- సులభ వాణిజ్యం: సులభవాణిజ్య ర్యాంకుల్లో 2014లో 142వ ర్యాంకులో ఉన్న దేశాన్ని 2019నాటికి 63కి చేర్చడం. అయిదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకోవడం. భారతీయ పన్ను వ్యవస్థను పారదర్శకంగా మార్చడం.
- సౌలభ్య జీవితం: డిజిటల్ ఇండియాను ప్రోత్సహించి పనిభారాన్ని తగ్గించడం. ప్రతి ఒక్కరికీ జల భద్రత కల్పించడం. అయిదేళ్లలో మౌలికవసతుల కల్పనకోసం రూ.లక్ష కోట్ల వ్యయం.
- అవినీతి నిర్మూలన: యూపీయే, ఎన్డీయే పాలనకు మధ్య స్పష్టమైన తేడా కనిపించేలా చేయడం. పరిపాలనలో ప్రతి పనినీ పారదర్శకంగా చేయడం.
- యువతకు సాధికారత:యువతను ప్రోత్సహించి భారత్ను ప్రపంచ స్టార్టప్ హబ్గా తీర్చిదిద్దడం. క్రీడలు, దేహదారుఢ్యాన్ని ప్రోత్సహించడం.
- అందరికీ ఆరోగ్యం: ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్లమందికి ఉచిత వైద్యం కల్పించడం. వైద్యపరమైన మౌలికవసతులను అభివృద్ధి చేయడం.
- మౌలికవసతుల కల్పన: ప్రపంచస్థాయి మౌలికవసతుల కల్పనకోసం రూ.100 లక్షల కోట్ల వ్యయం. విస్తృతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ ఏర్పాటుచేయడం.
- మధ్యతరగతికి సౌకర్యాలు: ఇళ్ల కొనుగోలుకు చేయూత. మధ్యతరగతి ప్రజలు మోసాలకు గురికాకుండా బలమైన నియంత్రణ వ్యవస్థనెలకొల్పడం. పొదుపుప్రోత్సహించడం.
- నవభారత నారీశక్తి: బాలికలకు అండగా నిలవడం. గర్భిణులకు వైద్యసేవలు అందించడం.
- రైతుల సౌభాగ్యం: వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు చేయడం. వ్యయసాయాన్ని సులభతరం చేసే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సమకూర్చడం.
- దేశానికి తొలి ప్రాధాన్యం: రక్షణ, అంతరిక్ష, అణుఇంధన రంగాల్లో స్వావలంబన సాధించేలా ప్రోత్సహించడం. జమ్మూ-కశ్మీర్ను భారత్లో సంపూర్ణంగా విలీనం చేయడం.
- ఈశాన్య రాష్ట్రాలు: వారసత్వంగా వచ్చిన సమస్యలను పరిష్కరించి శాంతి నెలకొల్పడం.
- సామాజిక సాధికారత: గిరిజనులు, మైనార్టీలు, చిన్నారులు, ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించడం.
- పేదల ముంగిటకు అభివృద్ధి: నిరుపేదలకు ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా చేయూతనివ్వడం.
- ఆర్థికాభివృద్ధిలో స్పష్టమైన మార్పు: కొవిడ్ అనంతరం భారత్ ఆర్థిక వ్యవస్థ రెక్కలు విప్పుకొని ఎగిరేలా చేయడం.
- కరోనాపై పోరాటం: ప్రాథమిక దశలోనే కరోనా ప్రమాదాన్ని గ్రహించి నియంత్రణ చర్యలు చేపట్టడం. పేదలు ఆకలితో అలమటించకుండా ఉచితంగా ఆహారధాన్యాలు అందించడం.