భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య నేడు జరగనున్న రెండవ ఇష్టాగోష్ఠికి సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే బలమైన శక్తులుగా ఎదుగుతున్న రెండు దేశాల అధినేతల సమావేశానికి తమిళనాడులోని మామల్లపురం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రెండు రోజుల చైనా అధ్యక్షుడి పర్యటనలో ఎలాంటి ఒప్పందాలు జరగనప్పటికీ... ఈ చారిత్రక సమావేశంలో అనేక విషయాలపై ఇరు నేతలు చర్చించే అవకాశముంది.
జిన్పింగ్తో భేటీ కోసం ఉదయం 11:15 నిమిషాలకు చెన్నైకు చేరుకుంటారు మోదీ. అక్కడే చైనా అధ్యక్షుడికి స్వాగతం పలుకుతారు. అనంతరం చెన్నై నుంచి మామల్లపురంలోని షోర్ ఆలయానికి పయనమవుతారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను అగ్రనేతలు తిలకించనున్నారు. ఆ తర్వాత చైనా అధ్యక్షుడికి ప్రత్యేక విందును ఇవ్వనున్నారు మోదీ.
శనివారం మోదీ-జిన్పింగ్ మధ్య చెన్నైలో అనధికారిక సమావేశం జరగనుంది. అనంతరం చైనాకు తిరుగుపయనమవుతారు జిన్పింగ్.