మహాత్మ... అన్న పదం వినగానే సగటు భారతీయుడికి గుర్తొచ్చే పేరు గాంధీ. మహాత్ములు ఎందరో ఉన్నా.. ఈ బక్కపలచని, బోసి నవ్వుల తాతయ్య పేరు ముందు.. 'మహాత్మ' అన్న పదం బిరుదుగా ఎలా మారిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఖద్దరు కట్టి.. చేత కర్ర పట్టి.. స్వతంత్ర పోరాటం చేపట్టి.. తెల్లవాళ్లను తరిమి కొట్టి.. భరతమాతకు బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించిన ఈ మామూలుమనిషి.. ఎలా మహాత్ముడయ్యాడు.?
ఎవరైనా తనని మహాత్మా అని పిలిస్తే గాంధీ ఆలోచించేవారట. ఎందుకంటే తాను అందరిలాంటి మనిషినేనని బాపూజీ భావించేవారు. అయితే అంతటి పేరు సంతరించుకోవటానికి మాత్రం ఆయన లక్ష్యాలే కారణం. అయితే కాలం, పరిస్థితులు కూడా గాంధీని మేరునగధీరుడ్ని చేయడంలో తమ వంతు పాత్ర పోషించాయి. ఆయన వ్యక్తిత్వం బాపూజీని హిమోన్నత శిఖరాలకు చేర్చింది.
తప్పులు చేసినా...
అందరిలానే గాంధీ ఆయన జీవితంలో ఎన్నో తప్పులు చేశారు. అయితే ఒకసారి చేసిన తప్పును మరోసారి చేయకుండా జాగ్రత్తపడ్డారు. ఈ తీరే ఆయన అభ్యున్నతికి కారణమైంది. జీవితంలోని ప్రతి మెట్టు దగ్గర ఆయన ఆత్మపరిశీలన చేసుకున్నారు. తప్పు జరిగితే నిస్సంకోచంగా ఆత్మపరీక్ష చేసుకునేవారు.
చేసే పనుల్లోనే కాదు చివరికి ఆలోచనల్లో కూడా ఏదైనా తప్పు దొర్లితే అది దైవం గమనిస్తుందని భావించేవారు బాపూ. ప్రపంచం మన తప్పుల్ని గమనించే లోపు.. మనమే వాటిని ఒప్పుకోవాలి అంటారు మహాత్ముడు.
వజ్రాయుధం...
ఒకసారి దక్షిణాఫ్రికాలోని ఫినిక్స్ ఆశ్రమంలో ఏదో తప్పు చేసినందుకు శిక్షగా ఒక పూట భోజనం చేయకుండా, ఉప్పు వినియోగించకుండా ఉన్నారు. ఇలాంటివే గాంధీని ఆమరణ నిరాహారదీక్షలకు సిద్ధం చేశాయి.
గాంధీ నియమాలు ఆశ్రమవాసులకు, సమాజానికి అలా నెమ్మదిగా చేరాయి. ఎప్పుడైనా స్వతంత్ర సంగ్రామంలో హింస చెలరేగినా, సమాజంలో మతోన్మాదాలు, వర్గ పోరాటాలు పెచ్చరిల్లినా వాటిపై సత్యాగ్రహమనే వజ్రాయుధాన్ని ప్రయోగించేవారు గాంధీ.
తన తప్పు తానే...
సాధారణంగా మనుషులు ఇతరుల తప్పులు వెతుకుతూ ఉంటారు. అయితే గాంధీ మాత్రం తనలో తప్పులు వెతికేవారు. ఏ చిన్న తప్పు దొరికినా దాన్ని.. అతిపెద్ద దోషంగా పరిగణించేవారు. ఎప్పుడు అది గమనించారో.. ఆ మరుక్షణమే ఇతరులకు తాను చేసిన దాని గురించి చెప్పేవారు. ఇలా నిరంతర బాటసారిగా.. సత్యాన్వేషణలో.. హిమాలయ శిఖరాలను అధిరోహించారు.
తర్కం, నమ్మకం..?