'దిశ' ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్న వేళ.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా దిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్ జంతర్మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అత్యాచార కేసు నిందితులను 6 నెలల్లోగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
"రాజస్థాన్లో ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఆమె కళ్లు కూడా బయటకు వచ్చాయి. హైదరాబాద్లో ఓ వైద్యురాలిని అత్యాచారం చేసి కాల్చేశారు. చాలా మంది ఇందులో భాగమయ్యారు. ఇప్పుడు ఇలా ఓ ఘటన జరిగింది. తర్వాత ఇంకొకటి, మరొకటి జరుగుతాయి. ఈ దేశంలో ఇంతే. ప్రతిరోజు ఎక్కడో అక్కడ దేశంలోని అనేకమంది ఆడబిడ్డలు చనిపోతున్నారు. వారి మృతదేహాలను చూస్తే మాకు చాలా భయమేస్తుంది. నాతో పాటు దేశం మొత్తం ఎంతో ఆగ్రహంగా ఉంది. నేను నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా."
-- స్వాతి మాలివాల్, దిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు
మోదీకి లేఖ...
మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు తెలిపారు స్వాతి. నిందితులకు ఆరు నెలల్లో ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసినట్టు పేర్కొన్నారు. చట్టాలను రూపొందిస్తే సరిపోదని.. వాటిని అమలు కూడా చేయాలన్నారు. పోలీసు వనరులను పెంచాలని అభ్యర్థించారు.