దశాబ్దాల క్రితం.. మానవాళి జీవితంలోకి ప్లాస్టిక్ ప్రవేశించకముందు ఎంతటి వారైనా.. నిత్యవసరాలు, ఇతర ఏ వస్తువులైనా తెచ్చుకోవాలంటే ఓ సంచితో బజారుకు బయల్దేరేవారు. అదే పద్ధతిని వినియోగించి ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ మార్గం చూపుతోంది మధ్యప్రదేశ్లోని భోపాల్ నగర పాలక సంస్థ.
నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు గత సెప్టెంబర్లో నగరంలోని పలు ప్రాంతాల్లో పాత దుస్తులతో సంచులు తయారు చేసే కేంద్రాలు ఏర్పాటు చేసింది. కేవలం 5 రూపాయలకే ఈ సంచులను అందిస్తూ ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పిస్తోంది. వీటి ద్వారా ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయమే కాదు.. మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.
అయితే ప్రస్తుతం ఈ సంచులను కొనుగోలు చేసేందుకు కొంత మేర నామూషీగా భావిస్తున్నప్పటికీ.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అంటున్నారు తయారీ కేంద్ర నిర్వాహకురాలు రబియా.
"ఇక్కడికి ప్లాస్టిక్ తీసుకువచ్చే వారి నుంచి మేము వాటిని స్వీకరిస్తాం. కార్యక్రమానికి మొదట్లో కంటే ఇప్పుడు స్పందన పెరిగింది. కానీ, ఈ వస్త్ర సంచులను కొనుగోలు చేయడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. పాత బట్టలతో కుట్టిన ఈ సంచులను తీసుకునేందుకు మొహమాటపడుతున్నారు. ఈ సంచి ధర కేవంలో 5 రూపాయలు. ఒకవేల వారు పాత దుస్తులు ఇస్తే ఆ డబ్బు కూడా తిరిగిచ్చేస్తాం. సంచులు తీసుకోని వారు కూడా.. ఇక్కడికి వచ్చి ప్లాస్టిక్ ఇచ్చి ఈ ఆలోచన బాగుందని ప్రశంసిస్తున్నారు. రోజూ కనీసం 5 నుంచి 10 సంచులు అమ్ముతాం. ఈ కార్యక్రమం ప్లాస్టిక్పై చాలా ప్రభావం చూపింది."