కర్ణాటకలోని మండ్య, హాసన్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని కొందరు జేడీఎస్ నేతలు, సంబంధీకుల నివాసాలు, పరిశ్రమలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. మండ్య జిల్లా పరిషత్ అధ్యక్షుడు, జేడీఎస్ నేత నాగరత్న స్వామికి చెందిన రెండు ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జడ్పీ సభ్యుడైన ఆదే పార్టీకి చెందిన మరో నాయకుడి ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు.
మండ్య, హాసన్ లోక్సభ నియోజకవర్గాల నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ మనుమళ్లు నిఖిల్, ప్రజ్వల్ పోటీలో ఉన్నారు.
4 బృందాలు, 60 మంది అధికారులు
60 మంది ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి బెంగళూరు, హాసన్, మండ్యలో 12 చోట్ల విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. వారికి సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణగా వచ్చారు. పన్ను ఎగవేతకు పాల్పడి, నల్లధనం కూడబెట్టారనే సమాచారంతోనే సోదాలు చేస్తున్నామని ఐటీ అధికారులు చెబుతున్నారు.