కరోనా వేళ బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ ప్రచండ తుపాను.. బంగాల్, ఒడిశాను వణికించిన తర్వాత క్రమంగా బలహీనపడుతున్నట్లు వెల్లడించింది భారత వాతావరణ విభాగం. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నట్లు తెలిపింది.
తుపాను తీరం దాటే సమయంలో భీకర గాలులు, కుంభవృష్టి వర్షాలకు చెట్లు కూలిపోయాయి. విద్యుత్త స్తంభాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కోల్కతా ప్రాంతంపైనా ఈ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపింది. బంగాల్లోనే సుమారు 12 మంది మరణించారని అంచనా.
గత 100 ఏళ్లలో ఇదే అత్యంత ప్రభావవంతమైన తుఫానని అభిప్రాయపడ్డారు బంగాల్ అధికారులు. ప్రస్తుతం కోలక్తా, కొన్ని జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్తు స్తంభాలను, కమ్యునికేషన్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు. ఎంత నష్టం వాటిల్లిందో ఇప్పుడే చెప్పలేమని కరోనా కన్నా దీని ప్రభావం చాలా ఎక్కువే ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.
ఆ రెండు రాష్ట్రాల్లో వర్షాలు..
మేఘాలయ, పశ్చిమ అసోం ప్రాంతాలపై తుఫాను ప్రభావం పాక్షికంగా ఉంటుందని... గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది వాతావరణ విభాగం. 12 గంటలు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని... కొన్ని ప్రాంతాల్లో సాధారణ నుంచి తీవ్ర వర్షం పాతం నమోదు కావచ్చని అంచనా వేసింది.