ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 15, 2021, 5:30 AM IST

Updated : Mar 15, 2021, 6:58 AM IST

ETV Bharat / state

మైదుకూరులో తెదేపా జోరు.. ఫ్యాన్ గాలిని తట్టుకుని ఎలా సాధ్యమైంది?

సీఎం సొంత జిల్లాలో ఏకపక్ష విజయాలు నమోదు చేసిన వైకాపా.. ఆ ఒక్కచోట తెలుగుదేశం కన్నా ఒక అడుగు వెనుకబడింది. ఓ వైపు ఎక్స్‌ అఫిషియో ఓట్లు.. మరోవైపు ప్రత్యర్థి పార్టీల్ని ఆకర్షించే ప్రయత్నాలతో ఎలాగైనా పీఠం చేజిక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇంతకీ అధికార పార్టీకి అక్కడ ఆ పరిస్థితులు.. ఎందుకు అనివార్యమయ్యాయి. తెలుగుదేశం అభ్యర్థుల్ని కాపాడుకోగలదా?

మైదుకూరులో సత్తా చాటిన తెదేపా
మైదుకూరులో సత్తా చాటిన తెదేపా

మైదుకూరులో సత్తా చాటిన తెదేపా

కడప జిల్లాలో.... కడప నగరపాలక సంస్థ, నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలను ఏకపక్షంగా గెలుచుకున్న ఎగరేసుకెళ్లిన వైకాపా.. మైదుకూరు మున్సిపాలిటీలో మాత్రం వెనుకబడింది. జిల్లాలో ప్రతిపురపాలికలోనూ.. కొన్ని వార్డుల్ని ఏకగ్రీవం చేసుకున్న వైకాపాకు.. మైదుకూరులో ఒక్క వార్డునూ ఏకగ్రీవం చేసుకునేందుకు తెలుగుదేశం అవకాశం ఇవ్వలేదు. వైకాపాకు దీటైన అభ్యర్థులతో నామినేషన్లు వేయించింది.

మైదుకూరు నియోజకవర్గ తెలుగుదేశం బాధ్యుడు పుట్టా సుధాకర్ యాదవ్.. పోటీలో ఉన్న అభ్యర్థులను రహస్య ప్రదేశానికి తరలించి ముందు నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతోపాటు స్థానికంగా వైకాపా ఛైర్మన్ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతను తెలుగుదేశం సొమ్ము చేసుకుంది. పోలింగ్‌కు రెండ్రోజుల ముందు తెలుగుదేశం ఛైర్మన్ అభ్యర్థి జగన్‌ను రాత్రి సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడం, కుటుంబ సభ్యులు ఆందోళన సైతం.. ఆ పార్టీకి సానుభూతి ఓట్లు కురిపించాయి.

ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగిన 24 వార్డుల్లో.. వైకాపా 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అత్యధికంగా.. 12 మంది తెలుగుదేశం కౌన్సెలర్లు విజయం సాధించారు. 19వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించగా... అతని మద్దతుపైనా తెలుగుదేశం ఆశలు పెట్టుకుంది. ఛైర్‌పర్సన్‌ ఎన్నికల్లో అతను మద్దతిస్తే తెలుగుదేశం బలం... 13 కు పెరగనుంది. ఇక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఎక్స్ అఫిషియో ఓట్లకు దరఖాస్తు చేసుకోగా.. వారి మద్దతుతో పీఠం దక్కించుకోవాలని వైకాపా చూస్తోంది.

ఓట్ల లెక్కింపు పూర్తైన వెంటనే గెలిచిన అభ్యర్థుల్ని తెదేపా, వైకాపా శిబిరాలకు తరలించాయి. తెలుగుదేశం 12 మంది కౌన్సిలర్లను ప్రొద్దుటూరులోని పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటికి తరలించారు. ఓ కౌన్సిలర్‌ను లాక్కునేందుకు వైకాపా ప్రయత్నించిందని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఒక్కస్థానం మాత్రమే ఆధిక్యం కావడంతో.. ఈ నెల 18 ఛైర్‌పర్సన్‌ ఎన్నిక జరిగే నాటికి రాజకీయం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. వైకాపాకున్న ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషియో ఓట్లతో ఛైర్మన్ పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. తెదేపా మాత్రం తమకు దక్కిన ప్రజాబలంతో ఛైర్మన్ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.

ఇవీ చదవండి:

కడప పుర పోరులో వీచిన 'ఫ్యాన్' గాలి

Last Updated : Mar 15, 2021, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details