విజయనగరం జిల్లాలో లాక్డౌన్ మూడో రోజు కట్టుదిట్టగా కొనసాగుతోంది. ప్రజలు బయటకు రాకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. అత్యవసర సరుకులు, కూరగాయల కొనుగోలుకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అనుమతిస్తున్నారు. రైతుబజార్లు, మార్కెట్లు ఆ వేళల్లో రద్దీగా కనిపిస్తున్నాయి. భారీగా తరలివస్తున్న ప్రజలను నియంత్రించేందుకు సామాజిక దూరం పాటించే విధంగా అధికారులు తగిన చర్యలు చేపట్టారు.
నగరంలో లాక్ డౌన్ అమలు తీరు, రైతు బజార్లు, మార్కెట్ ప్రాంతాల్లో పరిస్థితులను జిల్లా ఎస్పీ రాజకుమారి పర్యవేక్షించారు. సిబ్బందికి సూచనలు చేశారు. వ్యాపారులు, కొనుగోలుదార్లకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. 21 రోజులు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నిత్యావసరాలు, కూరగాయల కోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.