స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు నిచ్చిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. భాజపా మినహా ఏపీలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్కు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. గమ్యస్థానాలకు వెళ్లలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం ఒంటిగంట వరకు నడపబోమని.. మధ్యాహ్నం తర్వాత రోడ్ల మీద తిరుగుతాయని మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
మన్యంలో ప్రశాంతంగా..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ పాడేరు మన్యంలో బంద్ జరుగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. బంద్కు పిలుపు నిచ్చిన వామపక్షాలు కూడలిలో వాహనాలు నిలువరిస్తున్నారు. రహదారులన్నీ బోసిపోగా... ఆర్టీసీ బస్సులన్నీ డిపోకు పరిమితమయ్యాయి. నిరసనకారులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఏజెన్సీలో తెదేపా మాజీ మంత్రి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ , మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బంద్కు మద్దతు పలికి.. వామపక్షాలతో కలిసి ధర్నా చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనంపై వెళుతున్న వైకాపా పాడేరు ఎమ్మెల్యే .. తెదేపా నేత శ్రవణ్ కుమార్ను పలకరించారు.
వెనక్కి తగ్గం..!
మద్దిలపాలెం జాతీయ రహదారివద్ద వామపక్ష, ప్రజా, విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం వెనక్కి తగ్గేవరకు ఉద్యమం ఆగదని నేతలు అన్నారు. అధికార , ప్రతిపక్షాలు ఒక తాటి పైకి వచ్చి కేంద్రంతో చర్చలు చేసి ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కు తీసుకునేలా ఒత్తిడిచేయాలని డిమాండ్ చేశారు.