ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెడతారా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మంచి చేస్తున్నామో? చెడు చేస్తున్నామో? ఆలోచించే నాయకుడు ప్రభుత్వంలో లేకపోవటం దురదృష్టకరమన్నారు. డిస్టిలరీల్లో ఏ మద్యం తయారు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభించే లిక్కర్ ను వారం రోజులు తాగితే పక్షవాతం వస్తుందని సోమిరెడ్డి ప్రజలను హెచ్చరించారు. ఎప్పుడూ వినని బ్రాండ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అర్థం కావట్లేదన్నారు. చెత్తమందు తయారు చేసే డిస్టిలరీలను ప్రోత్సహించడమే కాక.. రేట్లు పెంచటం మరింత దుర్మార్గ చర్య అని సోమిరెడ్డి విమర్శించారు. ప్రాణాంతకమైన మద్యం తీసుకొచ్చి ప్రజల గొంతులో పోస్తున్నారని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.
లాక్డౌన్ ముగిసే వరకూ మద్యం దుకాణాలు మూసేఉంచాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో అమ్మే పాత బ్రాండ్లనే రాష్ట్రంలోనూ అమ్మాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతోనే దుకాణాలు తెరిచామని మంత్రులు చెప్పటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్రాలకు అనుమతులిచ్చినా... పొరుగు రాష్ట్రాలేవీ మద్యం దుకాణాలు తెరవలేదని గుర్తుచేశారు. భౌతికదూరంపై ప్రపంచ దేశాలు మొరపెట్టుకుంటుంటే.. మద్యం దుకాణాల వద్ద తొసుకునే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు.