ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీడని వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం - నెల్లూరులో వర్షాలు తాజా వార్తలు

నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నెల్లూరు నగరంలోని శివారు కాలనీలు మునకకు గురయ్యాయి. అనేక గ్రామీణ రోడ్లు దెబ్బతిన్నాయి. సాయంత్రం అయితే చలిగాలు వీస్తున్నాయి. జిల్లాలోని సోమశిల-కండలేరు జలాశయాలు నిండుకుండలా మారాయి. చెరువులు నిండాయి. ఈ సారి రబీలో రైతుకు సాగునీటి సమస్యలేదు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నారుమళ్లు, కొన్ని ప్రాంతాల్లో నాట్లు దెబ్బతిన్నాయి

rains at nelore district
rains at nelore district

By

Published : Nov 17, 2020, 12:06 PM IST

ఉపరితల ఆవర్తనంతో కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. అనేక లోతట్టు ప్రాంతాలతో పాటు అనేక గ్రామాల్లో వరి నార్లు, పంట పొలాలు నీటమునిగాయి. ఇంకోవైపు మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒక్క దీపావళి రోజు మినహా గడిచిన అయిదు రోజులుగా జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి.

నెల్లూరులో ముంచెత్తిన వాన

ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎగువ నుంచి పోటెత్తుతున్న వరద..ఈ పరిమాణాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే నిండు కుండలను తలపిస్తున్న జలాశయాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సోమశిల, కండలేరు, కనిగిరి, గండిపాళెం, స్వర్ణముఖి బ్యారేజీల వద్ద నీటి ఉద్ధృతిని అంచనా వేస్తోంది. గండిపాళెం మినహా.. మిగిలిన చోట్ల నిల్వ మట్టం పెరుగుతుండటంతో సామర్థ్యం మేరకు ఉంచేందుకు యత్నిస్తున్నారు. ఒక వేళ ప్రవాహం మరింత పెరిగితే దిగువకు విడుదల చేసేందుకూ సన్నద్ధమయ్యారు. ఇప్పటికే కనిగిరి జలాశయానికి సంబంధించి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఓజిలి మండలం నెమల్లపూడి వద్ద మామిడి కాలువ వంతెనపై వరద నీరు ప్రవహించింది. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాకాడు స్వర్ణముఖి బ్యారేజీ వద్ద వరద నీరు పెరగడంతో మూడు గేట్లు ఎత్తారు. చేజర్ల మండలం టీకేపాడు వద్ద నల్లవాగు పొంగిపొర్లడంతో అధికారులు అడ్డుగా కంచె వేసి రాకపోకలను నియంత్రించారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం చెల్లాయపాళెం ఎస్టీ కాలనీలో రెండు పూరిళ్లు నేల కూలగా.. పెనుబల్లి ఎస్సీ కాలనీలో వర్షపునీరు ఇళ్లలోకి చేరి ప్రజలు అవస్థలు పడ్డారు.

గూడూరు వద్ద పంబలేరు వాగు ప్రమాద స్థాయిలో ప్రవహించగా, సముద్రం ఆటుపోట్ల కారణంగా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లిపాళెంలోకి నీరు చేరింది. నెల్లూరు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వెనుక వైపు ప్రహరీ కూలి ఇళ్లు దెబ్బతిన్నాయి. ఓ మహిళకు గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కొన్ని గ్రామాల్లో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. అత్యధికంగా మనుబోలులో 115.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. వెంకటాచలం 98.6, కావలి 95.6, విడవలూరు 94.6, గూడూరు 93.4, కలువాయి 89.6, కొండాపురం 88.2, బోగోలు 83.0, కొడవలూరు 79.8, అల్లూరు 79.6 మి.మీ వర్షపాతం నమోదైంది.

వర్షాలకు నెల్లూరు నగరం జలమయమైంది. కాలువలు ఆక్రమణలకు గురికావడం, పూడికతో నిండిపోవడంతో నీరంతా రోడ్లపై ప్రవహించి... నగరం చెరువును తలపించింది. మాగుంట లేఅవుట్‌, గాంధీబొమ్మ కూడలి, లీలామహాల్‌ రోడ్డు, మినీ బైపాస్‌రోడ్డు, జీఎన్‌టీ రోడ్డు, సండే మార్కెట్‌, కలెక్టరేట్‌ రోడ్డు, పొగతోట తదితర ప్రాంతాల్లో వర్షపు, డ్రైనేజీ నీరు ఏరులై పారింది.

ఇదీ చదవండి:

నేడు రైతుల ఖాతాల్లోకి సున్నా వడ్డీ, పెట్టుబడి రాయితీ సొమ్ము

ABOUT THE AUTHOR

...view details