సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారుల మొదటి రోజు విచారణ ముగిసింది. మనీలాండరింగ్ కేసులో నేడు పూరీ జగన్నాథ్ను విచారించిన అధికారులు.. దాదాపు 10 గంటల పాటు పూరీని ప్రశ్నించారు. ఉదయం 10.15 గంటలకు పూరీ ఈడీ కార్యాలయానికి చేరుకోగా.. 11 గంటల సమయంలో ఈడీ అధికారుల బృందం విచారణ మొదలుపెట్టింది. భోజన విరామ సమయానికి అర్ధగంట వదిలిపెట్టి.. మళ్లీ రాత్రి 8.30 గంటల వరకు అధికారులు పూరీని ప్రశ్నించారు.
ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా దృష్టి సారించిన ఈడీ అధికారులు.. పూరీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను సేకరించారు. పూరీ జగన్నాథ్, తన చార్టెడ్ అకౌంటెంట్తో కలిసి ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. బ్యాంకు లావాదేవీలతో పాటు.. ఇతర ఆర్థిక విషయాలను ఈడీ అధికారులు ప్రశ్నించగా.. చార్టెడ్ అకౌంటెంట్ సాయంతో పూరీ జగన్నాథ్ సమాధానం ఇచ్చారు. అవసరమైతే అధికారులు పూరీని మరోసారి పిలిచే అవకాశం ఉంది.
పూరీని కలిసేందుకు వచ్చిన బండ్ల..
మరోవైపు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్.. ఈడీ కార్యాలయానికి వచ్చారు. పూరీని కలిసే ప్రయత్నం చేశారు. ఈడీ అధికారులు అందుకు అనుమతించకపోవడంతో.. దాదాపు గంట పాటు ఈడీ కార్యాలయంలోనే వేచి చూశారు. కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని ఈడీ అధికారులు కోరడంతో.. బండ్ల అక్కడి నుంచి వెళ్లిపోయారు.