15 రోజుల్లో 2 దుర్ఘటనలు.. 2నెలల్లో 3 కంపెనీల్లో ప్రమాదాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీ సీనియర్ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్జీ పాలిమర్స్ ఉదంతం, సాయినార్ కెమికల్స్, రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్స్లో వరుసగా దుర్ఘటనలు జరిగాయని చంద్రబాబు అన్నారు. బాధితులను ఆదుకునే చర్యలు తీసుకోకుండా.. కంపెనీలకే వైకాపా సర్కార్ వత్తాసు పలుకుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రమాదాల నివారణపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం హేయమన్నారు. తమ వైఫల్యాలకు తెదేపాపై నిందలు వేయడం వైకాపా నాయకులకు దురాలవాటుగా మారిందని మండిపడ్డారు. లక్షల పరీక్షలు చేశామని గొప్పలు చెప్పడం కాదని.. వైరస్ టెస్టింగ్ ఫలితాలు ఎంత త్వరగా ఇస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. వారాల తరబడి ఫలితాల్లో జాప్యం వల్లే ఏపిలో కరోనా వైరస్ విజృంభిస్తోందని అన్నారు. దీనికి వైకాపా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.