కరోనా వైరస్ ఆ కుటుంబాన్ని కుదిపేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ కుటుంబ యజమాని చనిపోయిన విషయం ఒకరోజంతా ఆ ఇంటివాళ్లకు తెలీదు. అప్పటివరకు ఇద్దరు కొడుకులు, కోడళ్లతో కళకళలాడిన ఆ కుటుంబంలో యజమాని భార్యకు కరోనా సోకింది. దీంతో ఆమెను ఐసొలేషన్కు తరలించారు. కొడుకులు, కోడళ్లను క్వారంటైన్కు పంపారు. అప్పటికే పక్షవాతంతో బాధపడుతున్న కుటుంబ యజమాని కంటైన్మెంట్ జోన్లో ఒంటరిగా ఇంట్లోనే ఉండిపోయారు. ఈనెల 2న మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు.
ఈ విషయం కుటంబసభ్యులెవరికీ తెలియదు. పొరుగువారు స్థానిక నాయకులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులు, పురపాలక అధికారులకు తెలియజేసినా ఎవరూ స్పందించలేదు. ఒకరోజు గడిచినా కుటుంబ సభ్యులు రాకపోవడంతో స్థానికులు గట్టిగా అధికారులను నిలదీయగా.. క్వారంటైన్లో ఉన్న కుమారుడు, కోడలికీ ఈ విషయం తెలియజేసి ఒకరోజు వచ్చేందుకు అవకాశం కల్పించారు.