తూర్పుగోదావరి జిల్లాలో..
డిప్లమో చదువుతున్న విద్యార్ధులకు వెంటనే పరీక్షలు రద్దు చేసి ప్రమోట్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కరోనా విజృంభిస్తున్నందున తెలంగాణలో పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణులను చేస్తుంటే...ఇక్కడ మాత్రం అక్టోబరు 3 నుంచి పరీక్షలకు సన్నాహాలు చేయడం సరికాదని జిల్లా కార్యదర్శి రాజా అన్నారు. వసతి గృహాలు, ప్రవేటు హాస్టళ్లు మూతపడినపుడు రోడ్లమీద ఉండి పరీక్షలు రాయాలా అని ప్రశ్నించారు. విద్యార్ధుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలని కోరారు.
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేశారు. రాష్ట్రంలో కొవిడ్ విజృంభిస్తున్నందున సాంకేతిక విద్యాశాఖ... అక్టోబర్ 16 నుంచి డిప్లమో, 1 నుంచి 5 సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను, సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. రాయదుర్గం కమిటీ ఆధ్వర్యంలో వారు ఆందోళన చేసి... తహసీల్దార్ సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1 లక్ష 20 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉందని అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి బంగి శివ అన్నారు. సాంకేతిక విద్యాశాఖ అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టి పరీక్షలను నిర్వహిస్తుందని వాపోయారు. విద్యార్థుల ఆరోగ్యాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. రెగ్యులర్, సప్లిమెంటరీ విద్యార్థుల పరీక్షలను రద్దు చేసి ప్రమోట్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి.మంత్రి నాని వ్యాఖ్యలపై దుమారం..బర్తరఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్