వినాయక చవితి ఉత్సవ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. విగ్రహాల తయారీ వ్యాపారులతో కలిసి భాజపా నేతలు అనంతపురంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో అన్ని పండుగలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చినా ప్రభుత్వం.. వినాయక చవితికి అనుమతి ఇవ్వకపోవడం దారుణం అని కమలం పార్టీ నాయకులు మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని.. గత రెండేళ్లుగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విగ్రహాల తయారీదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రంజాన్, క్రిస్మస్ పండుగలను కరోనా నిబంధనల మేరకు నిర్వహించారు.. అలాగే ఈ ఉత్సవాలను కూడా జరపాలని వాళ్లు వ్యాపారులు కోరుతున్నారు. రూ. లక్షల ఖర్చుతో అప్పులు చేసి మరీ విగ్రహాలను తయారు చేశామని.. ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. విగ్రహాలు అమ్ముకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. ప్రభుత్వ తమపట్ల దయ చూపాలని కోరారు. ఆందోళన చేస్తున్న వ్యాపారులు, భాజపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.