అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండల కేంద్రంలో మహిళతో కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధిత కుటుంబ సభ్యులు ఠాణాలో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు.
వేధింపులు చర్చనీయాంశం..
చేపల కాలనీలో నివాసం ఉంటున్న సలీమా అనే మహిళ పట్ల స్థానిక ఠాణాలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీరాములు అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే మహిళను లైంగికంగా వేధింపులకు గురిచేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా..
ఫలితంగా కాలనీ వాసులు మంగళవారం రాత్రి కానిస్టేబుల్ శ్రీరాములును చితకబాదారు. బాధితురాలి కుటుంబ సభ్యులు వెంటనే కనేకల్ ఠాణాలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారు.
ఎమ్మెల్యే జోక్యం..
వ్యవహారం బయటకు పొక్కడంతో రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, కనేకల్ మండల వైకాపా నాయకులు జోక్యం చేసుకున్నారు. కానిస్టేబుల్ తప్పు చేసిన ఘటన పునరావృతం కాకుండా మరో రెండు రోజుల్లో అతన్ని బదిలీ చేయిస్తామని అధికార పార్టీ నేతలు వెల్లడించారు.