MURDER: కుటుంబంలో ఆస్తి తగదా ఒకరి హత్యకు పురిగొల్పింది. సొంత తమ్ముడిపై అతడి సోదరులు, వదిన కలిసి గడ్డివామి వద్ద కర్రలతో దాడిచేయడంతో సింహాద్రి రవికుమార్ (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం సుంకొల్లులో మంగళవారం చోటుచేసుకుంది. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థానిక వైకాపా నాయకుల అండతోనే తన తండ్రిని చంపారని మృతుని కుమారుడు కార్తీక్ ఆరోపించారు. పోలీసులకు తాను వారి పేర్లు చెబుతున్నా ఫిర్యాదులో నమోదు చేయలేదని వాపోయాడు. విషయం తెలుసుకున్న తెదేపా నూజివీడు నియోజకవర్గ బాధ్యుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్దకు వచ్చి పోలీసులను నిలదీశారు. అనంతరం మృతుడి కుమారుడు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. ఆరుగురిపై కేసు నమోదు చేశారు.
పోలీసులను నిలదీస్తున్న వెంకటేశ్వరరావు
నేపథ్యమిది..పోలీసుల కథనం మేరకు.. సుంకొల్లులో ఆర్ఎస్ నం. 181-2లో 59 సెంట్ల మెరకభూమి ఉంది. ఇది 2016 నుంచి రవికుమార్ ఆధీనంలో ఉంది. దీనికి పాసుపుస్తకం, టైటిల్ డీడ్ కూడా వచ్చాయి. అయితే అతని సోదరులు రామకృష్ణారావు, మురళీమోహన్, వారి కుమారులు చందు, చంద్రశేఖర్, వంశీకృష్ణ, అలివేలు మంగమ్మ అనే మహిళ కలిసి సదరు భూమిని తమకు ఇచ్చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయమై వైకాపా నాయకులు అరేపల్లి రాంబాబు, కొండలరావు నూజివీడు గ్రామీణ పోలీసు స్టేషనులో సోమవారం పంచాయితీ నిర్వహించారు. ఎస్సై ఎదుటే వైకాపా నాయకులు బెదిరించడంతో తమకు స్టేషన్లో న్యాయం జరగదని రవికుమార్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చేశారు. ఎంత ఖర్చయినా మిమ్మల్ని చంపేస్తానంటూ వైకాపా నాయకులు బెదిరించినట్లు రవికుమార్ కుమారుడు కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.