ఐటీ ఉద్యోగుల వెసులుబాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వర్క్ఫ్రమ్ హోమ్టౌన్ కేంద్రాల వెబ్సైట్ను (Work from Home Town Centers website) పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Minister Gowtham reddy) ప్రారంభించారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా 29 చోట్ల వర్క్ఫ్రమ్ హోమ్ టౌన్ కేంద్రాలను (Work from Home Town Centers) ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఐటీ ఉద్యోగులకు (IT employees) వెసులుబాటు కల్పించేలా ఈ కేంద్రాల్లో 24 గంటల విద్యుత్, హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలను కల్పించినట్లు వివరించారు. మొత్తం 30 మంది కూర్చుని పని చేసుకునేలా వర్క్ఫ్రమ్ హోమ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం కొవిడ్ పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు (Software companies) ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పని చేయాలని సూచిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం వారికి వెసులుబాటు కల్పిస్తూ ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతానికి విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్దనగరాలలో ఒక్కో ఉద్యోగికి నెలకు రూ. 5 వేల మేర వ్యయం అవుతోందన్నారు. మిగతా చోట్ల రూ. 4 వేలు మాత్రమే వ్యయం చేస్తున్నట్లు వివరించారు. కొన్ని కార్పోరేట్ సంస్థలు వసూలు చేసే మొత్తంలో ఇది కేవలం 25 శాతం మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కేవలం ల్యాప్టాప్తో వచ్చి పని చేసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లూ చేసినట్లు తెలిపారు. కంపెనీలు, ఉద్యోగుల నుంచి వచ్చే డిమాండ్కు అనుగుణంగా మారుమూల ప్రాంతాలకూ ఈ సౌకర్యాలను విస్తరిస్తామని అన్నారు.