సింహాచలం(SIMHACHALAM) భూముల అక్రమాలపై ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. దేవస్థానానికి గతంలో ఈవోగా పని చేసిన రామచంద్రమోన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ దేవదాయ శాఖ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. సింహచలం దేవస్థానం రికార్డుల్లో నుంచి పెద్ద ఎత్తున భూములను తప్పించారని రామ చంద్రమోహన్ పై అభియోగం మోపారు. ప్రస్తుతం దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్-2 గా అతను బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
విచారణ పారదర్శకంగా జరిగేందుకే.. ప్రస్తుతం ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేసినట్టు దేవదాయ శాఖ కమిషనర్ పేర్కొన్నారు. సుమారు 700 ఎకరాలను సింహచలం దేవస్థానం రికార్డుల నుంచి తప్పించినట్టు దేవదాయ శాఖ గుర్తించింది. మాన్సాస్ ట్రస్ట్(MANSAS TRUST) భూముల వ్యవహరంలోనూ రామ చంద్రమోహన్ అక్రమాలకు పాల్పడినట్టు దేవదాయ శాఖ భావిస్తోంది. ఈ కోణంలోను విచారణ చేపట్టాలని యోచిస్తోంది.